గల్లా జయదేవ్ వర్సెస్ మిథున్ రెడ్డి: పరిశ్రమలు..చంద్రబాబు అవినీతి: ప్రధాని జోక్యం చేసుకోవాలంటూ..!
ఏపీలోనే కాదు..పార్లమెంట్ లోనూ టీడీపీ..వర్సెస్ వైసీపీ రాజకీయాలు నడుస్తున్నాయి. లోక్ సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి..టీడీపీ ఫ్లోర్ లీడర్ గల్లా జయదేవ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభలోని మిగిలిన పక్షాల నేతలు చూస్తుండగానే.. ఏపికి సంబంధిచిన అంశాల పైన లోక్ సభ వేదికగా ఆసక్తి కర చర్చ సాగింది. ఏపీ నుండి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని..ప్రభుత్వ విధానాలే దీనికి కారణమని గల్లా లోక్ సభలో ప్రస్తావించారుద. ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. దీనికి మిథన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు హాయంలో జరిగిన అవినీతి పైన విచారణ జరిపించాలని సభా వేదికగా ప్రధానిని కోరారు. దీంతో..ఈ చర్చ మొత్తాన్ని మిగిలిన పార్టీల సభ్యులు ఆసక్తిగా గమనించారు.
పెట్టుబడులు వెళ్లిపోతున్నాయి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రం నుంచి పెట్టుబడులన్నీ వెళ్లిపోతున్నాయని.. ఇది దేశ పెట్టుబడుల వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నందున ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని తెదేపా లోక్సభా పక్షనేత గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. లోక్ సభలో ఆయన ఈ అంశం పైన మాట్లాడుతున్న సమయంలో వైసీపీ సభ్యులు అడ్డుతగిలారు. దీంతో.. ఆయన మాట్లాడుతున్నంత సేపూ కొంత ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్టుల రద్దు.. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల సమీక్ష..ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్లాంటి ఏపీ ప్రభుత్వ తెలివితక్కువ.. అహేతుకమైన.. ఏకపక్ష నిర్ణయాలతో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి పారిపోతున్నారు. కొన్ని దేశాలు రాష్ట్రానికి వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయని చెప్పుకొచ్చారు.
ఏపీతో పాటుగా దేశ విశ్వసనీయతకు దెబ్బ..
ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రంతోపాటు.. దేశ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని జయదేవ్ వివరించారు. 7వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీలున్న లులూగ్రూప్ రూ.2,200 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిందని గుర్తు చేసారు. అదానీ సంస్థ తన ల్యాండ్ బ్యాంక్ను 400 ఎకరాల నుంచి 89 ఎకరాలకు తగ్గించుకొందన్నారు. బీఆర్షెట్టీ గ్రూప్ రూ.12 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను వెనక్కు తీసుకొందని సభకు నివేదించారు. రిలయన్స్ సంస్థ తిరుపతిలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకొందన్నారు. ఇలా చాలా ఉన్నాయని ప్రధాని జోక్యం చేసుకొని దేశ పరువు, ప్రతిష్ఠలను కాపాడాలని కోరుతున్నానని అభ్యర్ధించారు.
బాబు అవినీతి పై ప్రధాని విచారణ చేయించాలి..
జయదేవ్ వ్యాఖ్యలను వైకాపా లోక్సభాపక్షనేత మిథున్రెడ్డి ఖండించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హాయంలో అనేక రకాలైన అవినీతి చోటు చేసుకుందని..అక్రమ పద్దతుల్లో వ్యవహరించారని ఆరోపించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అత్యంత అవినీతి రాష్ట్రంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఎకనమిక్స్ ఫర్ అప్లైడ్ రీసెర్చ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. చంద్రబాబు ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వాటన్నింటి పైనా విచారణ జరిపించాలని ప్రధానిని కోరుతున్నామంటూ..సభలో మిథున్ రెడ్డి కోరాు.