టీడిపి. వైసీపి ఆ కమ్యూనిటీని ఓటు బ్యాంకుగానే చూసాయా..?అందుకే ఏపీ కాపుల చూపు కమలం వైపా..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపీలో భారతీయ జనతా పార్టీ వైసీపీకు ధీటుగా ఎదగాలి. దీనికోసం ఎంత వరకైనా వెళ్లండీ. కానీ.. టీడీపీ భూస్థాపితం కావాలి. అన్నది బీజేపి అదిష్టానం నినాదంగా తెలుస్తోంది. దీన్ని అనువుగా వాడుకునేందుకు కమలనాథులు గట్టిగానే పావులు కదుపుతున్నారు. దానిలో భాగంగానే టీడీపీలోని అసంతృప్త నేతలు, వ్యాపారాలున్న కీలక నాయకులకు ఎరవేస్తున్నారు.
అన్నింటినీ మించి ఒకప్పుడు కాంగ్రెస్కు వెన్నుదన్నుగా నిలిచిన కాపులను బీజేపీ వైపు తిప్పుకునేందుకు అమిత్షా సారథ్యంలో ఓ బృందం ఇప్పటికే ఏపీలో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తోట త్రిమూర్తులు, గంటా వంటి వారితో మంతనాలు జరిగాయట. ఫలితంగా మొన్నీ మద్య టీడీపీలో తోట త్రిమూర్తులు అండ్ బ్యాచ్ దాదాపు 50 మంది వరకూ కాకినాడలోని ఓ గెస్ట్ హౌస్లో సమావేశమయ్యారు. గతంలో తమను వైసీపీ ఆహ్వానించినా వెళ్లకపోవటం పొరపాటుగా చర్చించుకున్నారట.
భవిష్యత్ రాజకీయాల్లో కొనసాగేందుకు వీలుగా అనువైన పార్టీ ఏదనే అంశంపై కూడా సుదీర్ఘ మంతనాటు జరిపినట్టు సమాచారం.ఇప్పటికే అంబిక బ్రదర్స్, జేసీ బ్రదర్స్, కేఈ కుటుంబం, టీజీ వెంకటేశ్ ఇలా.. ఒక్కొకరూ పార్టీను వీడుతుండటంతో చంద్రబాబు కాపులతో స్వయంగా ఫోన్లో మాట్లాడారట. అయితే.. వీరిలో బోండా ఉమా ఫోన్లో అందుబాటులోకి రాలేదని సమాచారం. పైగా రెండ్రోజులుగా ఫోన్ స్విఛాఫ్ చేయటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కూడా పలుమార్లు కాపు నాయకులు, జనసేన నుంచి బయటకు వచ్చిన వారితో స్వయంగా చర్చలు జరుపుతున్నారట. రాబోయే స్థానిక ఎన్నికల్లో కమలం ఎంతోకొంత బలం చాటుకోవాలనుకుంటుంది.
గెలుపోటములు సంగతి ఎలా ఉన్నా కనీసం పల్లెల్లో కాషాయజెండా పట్టుకునేవారిని పెంచాలనకుంటుంది. మోదీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఏపీలో తాము పుంజుకోవాలనే బీజేపీ యాక్షన్ ప్లాన్. దీనికి తన వంతుగా తోడ్పాటును అందిస్తానంటూ కేంద్ర సహాయమంత్రి కిషన్రెడ్డి ఏపీ నేతలకు హామీనిచ్చారు. తాను కూడా రెడ్డి వర్గంనుంచి కాషాయ కండువా కప్పుకునేందుకు ఆసక్తిగా ఉన్నవారితో మాట్టాడుతున్నారట. మరి అదే జరిగితే.. పాపం.. టీడీపీ కోలుకోలేని దెబ్బ తినాల్సి వస్తుందేమో కాలమే సమాధానం చెప్పాలి..!