అనంతలో ఏం జరుగుతోంది? పెండింగ్ లో 5 కీలక స్థానాలు ! ఇంకా అభ్యర్థులను ప్రకటించని టీడీపీ
Recommended Video
అనంతపురం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి జిల్లాల్లో అనంతపురం ఒకటి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ అనంతపురం జిల్లా తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతూ వచ్చింది. మధ్యలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తప్ప మిగిలిన అన్ని సార్లు అనంతపురం తెలుగుదేశానికి అత్యధిక శాసనసభ స్థానాలను అందజేసింది. అలాంటి అనంతపురంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎదురీదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లు ఉండగా.. 2014 ఎన్నికల్లో 12 స్థానాల్లో టీడీపీ జెండా పాతింది. రెండు చోట్ల మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు రుచి చూసింది. వైఎస్ఆర్ సీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు టీడీపీ కండువా కప్పుకొన్నారు.
డ్రీం క్యాబినెట్ - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
సిట్టింగులకు ఎర్త్ పెట్టినట్టేనా?
అలాంటి బలమై అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అయిదు కీలక స్థానాలపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ అయిదింట్లో ఫిరాయింపు ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న కదిరి నియోజకవర్గాన్ని వదిలేస్తే.. మిగిలిన నాలుగు చోట్లా టీడీపీకి సిట్టింగులు ఉన్నారు. అయినప్పటికీ- వారి అభ్యర్థిత్వాలను ఖరారు చేయడంలో లేదా, కొత్త ముఖాలను తెర పైకి తీసుకుని రావడంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుకాడుతున్నారు. అనంతపురం టౌన్, కళ్యాణ దుర్గం, శింగనమల, కదిరి, గుంతకల్లు నియోజకవర్గాల అభ్యర్థులను టీడీపీ ఇంకా ఖరారు చేయలేదు. దీనితో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.
తెలుగుదేశం పార్టీ తన తొలి జాబితాలో హిందూపురం (నందమూరి బాలకృష్ణ), రాప్తాడు (పరిటాల శ్రీరామ్), ధర్మవరం (గోనుగుంట్ల సూర్యనారాయణ), పెనుకొండ (బీకే పార్థసారథి), పుట్టపర్తి (పల్లె రఘునాథరెడ్డి) స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. మలి జాబితాలో రాయదుర్గం (కాల్వ శ్రీనివాసులు), ఉరవకొండ (పయ్యావుల కేశవ్), తాడిపత్రి (జేసీ అస్మిత్ రెడ్డి), మడకశిర (కే ఈరన్న) సీట్లల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. అనంతపురం టౌన్, కళ్యాణ దుర్గం, శింగనమల, కదిరి, గుంతకల్లులలను పెండింగ్ లో పెట్టింది.
అభ్యర్థులను మార్చాల్సిందేనంటోన్న జేసీ..
తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డే దీనికి కారణమని తెలుస్తోంది. తన లోక్ సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లలోకి వచ్చే ఈ నాలుగు స్థానాల్లో తాను చెప్పిన వారిని అభ్యర్థులుగా నిలబెట్టాలని, లేదంటే పార్టీకి గుడ్ బై చెబుతానని ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు సమాచారం. పైగా తాడిపత్రిలో ఇదివరకే తన కుమారుడు అస్మిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా వెనక్కి తీసుకుంటానని జేసీ చెబుతున్నట్లు తెలుస్తోంది. జేసీ బెదిరింపులకు లొంగి, అభ్యర్థిత్వాలను మార్చితే.. పరిస్థితి మరింత తీవ్రమౌతుందనే భావన జిల్లా టీడీపీ నేతల్లో వ్యక్తమౌతోంది.
వారంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడం, వారి అభ్యర్థిత్వాలనే మార్చేస్తే.. ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీలో దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని పార్టీ శ్రేణులు అంటున్నారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏమిటంటే- ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా సిట్టింగులు ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. తామే అభ్యర్థులమని చెప్పుకొంటూ ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు.
జేసీతో వైరమే కారణం
అనంతపురం అర్బన్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి, జేసీ దివాకర్ రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ప్రభాకర్ చౌదరి అభ్యర్థిత్వాన్ని జేసీ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. గుంతకల్లు, శింగనమల, కళ్యాణ దుర్గంలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నాలుగు చోట్లా అభ్యర్థులను మార్చకపోతే ఓడిపోవడం ఖాయమని జేసీ జోస్యం చెబుతున్నారు. గుంతకల్లులో జితేందర్ గౌడ్, శింగనమలలో యామినీబాల, కళ్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరిలను పక్కన పెట్టడానికి చంద్రబాబు అంగీకరించట్లేదు.
గుడ్ బై చెబుతానంటోన్న జేసీ
మధ్యేమార్గంగా జేసీ మాట మేరకు ఇద్దరిని తప్పించడం, ఇద్దరు సిట్టింగులను టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గంలల్లో ఉన్న సిట్టింగులు ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. వారిని కాకుండా.. గుంతకల్లులో జితేందర్ గౌడ్, శింగనమలలో యామినీబాల అభ్యర్థిత్వాలను మార్చడానికి చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెబుతున్నారు. దీనికి కూడా జేసీ ససేమిరా అంటున్నారని, అభ్యర్థిత్వాలను మార్చకపోతే తాను, తన కుమారుడు పార్టీకి గుడ్ బై చెబుతామని జేసీ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.
కొద్దిరోజుల కిందటే- స్వయంగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఎదుటే- జేసీ దివాకర్ రెడ్డి చెలరేగిపోయారు. యామినీబాల, ఆమె తల్లి ఎమ్మెల్సీ శమంతక మణిలపై తీవ్ర పదజాలంతో చిందులు తొక్కారు. దీనితో వారి అభ్యర్థిత్వాన్ని బలపర్చడానికి జేసీకి ఎంత మాత్రమూ ఇష్టం లేదనే విషయం మరోసారి స్పష్టమైంది.