'లోకేష్' ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్, విషమంగా యువ కార్యకర్త పరిస్థితి
కరెంట్ షాక్ తో గాయపడిన యువ కార్యకర్తను అనిల్ కుమార్ గా గుర్తించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
కాకినాడ: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లాలో తన తొలి అధికారిక పర్యటన చేయనున్నారు. అధికారులు ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మంత్రి లోకేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది.
కాకినాడ టౌన్ లో లోకేష్ కు స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు కడుతున్న సమయంలో టీడీపీ కార్యకర్త ఒకరికి కరెంట్ షాక్ తగిలింది. తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఓ కరెంటు స్తంభానికి ఫ్లెక్సీ కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి గాయపడినట్లు తెలుస్తోంది.
కరెంట్ షాక్ తో గాయపడిన యువ కార్యకర్తను అనిల్ కుమార్ గా గుర్తించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. నారా లోకేష్ తొలి అధికారిక పర్యటనలో విషాదం చోటు చేసుకోవడం కార్యకర్తలను కొంత ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది.