హోదాపై లోకసభలో గందరగోళమే: ముందు తేల్చండి.. స్పీకర్కు ఖర్గే
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాకు జాతీయ స్థాయి రాజకీయ నేతల మద్దతు లభిస్తోంది. మంగళవారం నాటి సమావేశాల్లో భాగంగా ఏపీకి చెందిన టిడిపి, వైసిపి ఎంపీల వరుస నిరసనల నేపథ్యంలో రెండుసార్లు వాయిదా పడింది.
అనంతరం కాసేపటికి లోకసభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రత్యేక హోదాపై నిలదీశారు. తొలుత ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని తేల్చాలని ఆయన లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కోరారు.
ఏపీ ఎంపీల వాదన న్యాయమైనదేనని చెప్పారు. ఆ విషయంపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, అంతకుముందు టిడిపి, వైసిపి ఎంపీల నిరసనతో లోకసభను ఒకటికి రెండుసార్లు సభను వాయిదా వేశారు.
ఉదయం పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద వారు ప్లకార్డులతో నిరసన తెలిపారు. తాము ప్రతిపాదించిన వాయిదా తీర్మానం మేరకు ప్రత్యేక హోదా అంశంపై చర్చకు అనుమతించాలని నినాదాలు చేశారు. వైసిపి ఎంపీలు కూడా పోడియంను చుట్టుముట్టారు.