విజయసాయిరెడ్డితో మొదలు!: అందివచ్చిన అవకాశం, చంద్రబాబుకు జగన్ దెబ్బకు దెబ్బ
Recommended Video
విజయవాడ: అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ మధ్య ఢిల్లీ అంశంపై మాటల యుద్ధం నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీ నేత బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి బీజేపీ నేత ఆకుల సత్యనారాయణతో భేటీపై టీడీపీ నేతలు విమర్శలు చేయగా, ఇప్పుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో చేయి కలపడంపై వైసీపీ నేతలు టార్గెట్ చేశారు.
వైసీపీ ఇప్పుడు దెబ్బకు దెబ్బ అన్నట్లుగా వ్యవహరిస్తోన్నట్లుగా కనిపిస్తోంది. ఏ పార్టీ నాయకులు ఏ పార్టీ వారినైనా కలవవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు ఎవరిని కలిసినా చర్చనీయాంశం కావడం లేదా విమర్శలకు తావివ్వడం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ప్రజాప్రతినిధిగా ఉన్న విజయసాయి రెడ్డి ప్రధాని కార్యాలయంలో తచ్చాడటంపై టీడీపీ విమర్శలు చేసింది.
విజయసాయి రెడ్డితో మొదలు!
విజయసాయి రెడ్డి కూడా ఓ ప్రజాప్రతినిధి. ఆయన రాజ్యసభ సభ్యులు. ప్రధానిని ఎవరైనా కలువవచ్చునని బీజేపీ, వైసీపీ నేతలు చెప్పారు. అయితే తమకు అపాయింటుమెంట్ ఇవ్వలేదని, ఓ క్రిమినల్కు ఇచ్చారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. దానికి వైసీపీ కూడా ఘాటుగానే స్పందించింది. జగన్, విజయసాయిలు ఎలాంటి తప్పు చేయలేదని, కోర్టులో నిర్ధారణ కాలేదని, కానీ చంద్రబాబు ఎన్నో కేసుల్లో కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని విమర్శించారు.
బుగ్గన-ఆకుల భేటీ
ఆ విషయం కొన్నాళ్లకు సమసిపోయింది. అది ముగిసిందో లేదో మళ్లీ బుగ్గన - ఆకుల సత్యనారాయణలు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని టిడిపి నేతలు పదేపదే టార్గెట్ చేశారు. బుగ్గన బీజేపీ చీఫ్ అమిత్ షా, రామ్ మాధవ్లను కలిశారని, దీంతోనే వారి మధ్య ఉన్న లాలూచీ అర్థమవుతోందని టీడీపీ విమర్శించింది.
జగన్కు అందివచ్చిన అవకాశం
అంతలోనే నీతి ఆయోగ్ రూపంలో వైసీపీకి టీడీపీని నిలదీసే అవకాశం వచ్చింది. నీతి ఆయోగ్ భేటీలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు నిలదీస్తారని, అవసరమైతే ఇతర సీఎంలతో కలిసి వాకౌట్ చేస్తారని ప్రచారం జరిగింది. దీనినే ఆయుధంగా చేసుకొని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. అంతేకాదు, ఈ సమావేశంలో చంద్రబాబు - మోడీ చేయి కలపడాన్ని ప్రశ్నిస్తోంది.
ఏపీలో పులి, ఢిల్లీలో పిల్లి
సమావేశంలో బీజేపీని దులిపేస్తానని అమరావతిలో ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి వంగి వంగి ప్రధాని మోడీకి నమస్కారాలు చేశారని, కేసుల కారణంగా ముఖ్యమంత్రి బీజేపీకి లొంగిపోయారని, ఏపీలో పులి, ఢిల్లీలో పిల్లిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, రోజా తదితరులు విమర్శలు గుప్పించారు. బుగ్గన భేటీని వేలెత్తి చూపిన సమయంలో వైసీపీ.. నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు - మోడీ సమావేశాన్ని అందిపుచ్చుకొని ఎదురుదాడికి దిగింది. బుగ్గన - ఆకుల భేటీపై స్వయంగా సీఎం చంద్రబాబు, చంద్రబాబు - మోడీ భేటీపై స్వయంగా జగన్లు కూడా విమర్శలు గుప్పించారు. మొత్తంగా టీడీపీ, వైసీపీలు ఒకరిపై మరోకరు.. కేంద్రం ముందు నువ్వు పిల్లి అంటే నువ్వు పిల్లి అన్నట్లుగా విమర్శలు గుప్పించుకుంటున్నారు.