ఆగని టీడీపీ, వైసీపీ ఎంపీల ఆందోళన: చర్చి ఫాదర్గా శివప్రసాద్
Recommended Video
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బుధవారం జరిగిన పార్లమెంటు సమావేశాల్లోనూ నిరసనలు వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ పోడియం వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
టీడీపీ, వైసీపీ, ఇతర పార్టీల ఎంపీల ఆందోళనలతో అటు లోకసభ, ఇటు రాజ్యసభలు వాయిదా పడ్డాయి. దీంతో పార్లమెంటు బయటకు వచ్చిన టీడీపీ, వైసీపీ ఎంపీలు ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఏపీకి అండగా నిలవాలని అన్ని పార్టీల ఎంపీలకు తిరుమల వెంకన్న ప్రసాదాన్ని పంచుతున్నట్లు టీడీపీ ఎంపీ మాగంటి బాబు తెలిపారు.
సభలు తిరిగి ప్రారంభమైనా ఆగని ఆందోళనలు
లోకసభ, రాజ్యసభలు వాయిదాల అనంతరం ప్రారంభమయ్యాయి. అయినా టీడీపీ, వైసీపీ, అటు రిజర్వేషన్ల బిల్లు కోసం టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఇతర విపక్షాల ఎంపీలు సభలో ఆందోళనలు నిర్వహించాయి. దీంతో ఆందోళనల మధ్యే స్పీకర్ సభను నడిపించారు. పలు బిల్లులను కూడా ప్రవేశపెట్టారు. దీంతో విపక్షాల ఎంపీలు మరింత గట్టిగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. పీఎన్బీ స్కాంపై ఇతర విపక్ష ఎంపీలు నిరసనలు చేపట్టారు. కాగా, 8రోజుల నుంచి వరుసగా, టీడీపీ, వైసీపీలు సభలో నిరసనలు తెలుపుతున్నారు.
బిల్లులకు ఆమోదం
విపక్షాల నిరసనల మధ్యే కేంద్రం పలు బిల్లులను ఆమోదింపజేసుకుంది. ద్రవ్య వినిమయ బిల్లు, సవరణలను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించగా సభ ఆమోదం తెలిపింది. స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనలకూ సభ ఆమోదముద్ర వేసింది.
చర్చి ఫాదర్ వేషాధారణలో శివప్రసాద్
చిత్తూరు ఎంపీ శివప్రసాద్ బుధవారం చర్చి ఫాదర్ వేషధారణలో పార్లమెంటు ఆవరణలో కలియతిరుగుతూ పలువురిని ఆకర్షించారు. విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు నిర్వహిస్తున్న ఆందోళనల్లో ఎంపీ శివప్రసాద్ రోజుకొక వేషదారణతో వస్తున్న విషయం తెలిసిందే. బుధవారం చర్చి ఫాదర్ గెటప్ వేసి చేతిలో బైబిల్ పట్టుకుని నిరసన చేపట్టారు.