టీడీపీకి షాక్: భోరున ఏడ్చిన జడ్పీటీసీ, ఇన్ని అవమానాలా!, ఇక నావల్ల కాదంటూ..
అనంతపురం జిల్లా డి.హీరేహాల్ కు చెందిన టీడీపీ జడ్పీటీసీ పద్మ తన పదవికి రాజీనామా చేయడానికి సిద్దపడ్డారు.
అనంతపురం: పేరుకు జడ్పీటీసీయే గానీ ఎక్కడా తన అధికారం చెల్లుబాటు కానివ్వడం లేదని, ఆఖరికి సొంత పార్టీలోను తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని డి.హీరేహాల్ కు చెందిన టీడీపీ జడ్పీటీసీ పద్మ ఆవేదన చెందుతున్నారు.
పార్టీలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు తనను వెంటాడుతున్నాయని, ఇంతటి అడ్డంకుల నడుమ తాను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అసాధ్యంగా మారిందని ఆమె వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉండి ఇక లాభం లేదనుకున్న ఆమె రాజీనామాకు సిద్దపడ్డారు. గురువారం నాడు జిల్లా పరిషత్ స్థానిక సమావేశంలో.. తన రాజీనామా లేఖను సమర్పించేందుకు వచ్చారు.
అయితే మంత్రి పరిటాల సునీత, ఇతర జిల్లా అధికారులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాజీనామా చేయవద్దని చెబుతూ.. సభ నుంచి పక్కకు తీసుకెళ్లి ఆమెను సముదాయించారు. రాజీనామాకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీలో ఎదురవుతున్న అవమానాలే తన రాజీనామాకు కారణమని ఆమె పేర్కొనడం గమనార్హం.
తన కష్టాలు చెప్పుకుంటూ ఒకానొక దశలో ఆమె భోరును ఏడ్చారు. కడు పేద కుటుంబంలో పెట్టిన తాను, తన భర్త నేటికీ ప్రైవేటు టీచర్లుగా పనిచేసుకుంటూ బతుకుతున్నామని గుర్తుచేశారు. అక్రమాలు, అన్యాయాలు చేయడం తమకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీటీసీ హోదాలో ఎంత ప్రయత్నిస్తున్నా.. మండలంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగడం లేదని, అడుగడుగునా కొంతమంది తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
Recommended Video
పార్టీ వ్యక్తులే ఉద్దేశపూర్వకంగా తమను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. విషయాన్ని పార్టీ పెద్దలకు చెప్పినా లాభం లేకుండా పోయిందన్నారు. ఏళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్న తమకు కనీసం గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందారు. అటు ప్రజలకు న్యాయం చేయలేక, ఇటు తమకు కనీస గౌరవం దక్కని చోట ఉండకూడదని నిర్ణయించుకునే రాజీనామాకు సిద్దపడినట్లు తెలిపారు.
కలెక్టర్కు రాజీనామా లేఖ ఇచ్చేందుకు వెళ్తున్న జడ్పీటీసీ పద్మను ఎమ్మెల్యే వరదాపురం సూరి వారించినట్లుగా తెలుస్తోంది. ఇంతలో ఆమె రాజీనామా లేఖను మంత్రి పరిటాల సునీత అందుకున్నారు. గురువారం రాత్రి వరకు ఆమె రాజీనామా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.