'ఆదినారాయణ రెడ్డిని టిడిపిలోకి రానివ్వం', పిచ్చికుక్కలు మొరుగుతున్నాయ్: చెవిరెడ్డి
అనంతపురం/చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కడప జిల్లా నేత ఆదినారాయణ రెడ్డిని తమ పార్టీలోకి రానివ్వవద్దని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రామసుబ్బా రెడ్డి సోమవారం నాడు అన్నారు. ఆదినారాయణ రెడ్డి రాకను తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
ఆదినారాయణ రెడ్డి అవసరం లేదని, ఈ విషయాన్ని తాము తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. అతనిని పార్టీలోకి తీసుకోవద్దని వివరించానని తెలిపారు.
హత్యా రాజకీయాలు చేసే వారిని తీసుకుంటే ప్రజల్లోకి, కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీ వైపు వెళ్లడం అతనికి అలవాటేనని ఎద్దేవా చేశారు. ఆదినారాయణ రెడ్డిని రానిచ్చేది లేదని స్పష్టం చేశారు.
67 మంది రాజీనామాకు సిద్ధం: చెవిరెడ్డి
తమ పార్టీ అద్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షలో తప్పుంటే తమ పార్టీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేలం రాజీనామాకు సిద్ధమని తిరుపతి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి సవాల్ చేశారు. జగన్ పైన, ఆయన దీక్ష పైన పిచ్చికుక్కలు మొరుగుతున్నాయని.. టిడిపి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాజధాని శంకుస్థాపనను బాధ్యతగా తీసుకోండి... పార్టీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు
రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి లోపాలు జరగకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు మరింత జాగ్రత్త వహిస్తున్నారు.
ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు శంకుస్థాపనను బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాజధాని ఏర్పాట్ల గురించి వారితో చర్చించారు. 'మన మట్టి- మన నీరు- మన అమరావతి' స్ఫూర్తితో పార్టీ శ్రేణులంతా చురుగ్గా పాల్గొనాలని సూచించారు. అంతేగాక ఈ నెల 18న నిర్వహించే 5కె, 10కె రన్ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలన్నారు.