గురువుకు దేహశుద్ది చేసిన తల్లిదండ్రులు....విద్యార్ధినులతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఫలితం
విద్యార్ధినులతో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా ఓ ఉపాధ్యాయుడు తానే దండనకు గురయ్యాడు.
విద్యార్థులు తప్పుచేస్తే దండించాల్సిన గురువు తన అసభ్య ప్రవర్తన కారణంగా తన్నులు తిన్న ఘటన ఇది. చిత్తూరు జిల్లా వి.కోట మండలం పరిధిలోని ఖాజీపేట ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న తిరుమల ప్రసాద్ విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
విద్యార్థినులతో అసభ్యంగా మాట్లాడటం, తనతో చనువుగా మెలగాలని సూచించడం, వారితో అభ్యంతరకరంగా ప్రవర్తించడం చేస్తున్నట్లుగా విద్యార్ధినులు , వారిని తమ తల్లిదండ్రులకు తెలిపారు. కొంతమంది తల్లిదండ్రులు ఈ విషయమై టీచర్ తిరుమల ప్రసాద్ ను హెచ్చరించినా తీరు మార్చుకోలేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో టీచర్ తిరుమలప్రసాద్ సోమవారం ఉదయం తరగతి గదిలో మరోసారి విద్యార్ధినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఈసారి అతడి వేధింపులు శృతిమించాయని తెలిసింది. దీంతో విరామ సమయంలో విద్యార్ధినులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆ తరగతి విద్యార్థినుల సోదరులు మరికొంతమంది స్థానిక యువకులు కలసి పాఠశాల వద్దకు వచ్చి తరగతిగతిలో ఉన్న ఉపాధ్యాయుడు తిరుమల ప్రసాద్ ను బయటకు లాక్కొచ్చి చెట్టుకి కట్టేసి కొట్టారు.
ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడిని విడిపించి జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టీచర్ తిరుమలప్రసాద్ను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ప్రకటించారు.