Teachers Day special:చెప్పాడంటే చేస్తాడంతే: గురువుకు జగన్ ఇచ్చిన గౌరవం.. భారతిసైతం..!
కడప: ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల జీవితాల్లో వారి గురువులు పోషించిన పాత్ర ఎలాంటిదో గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా తన గురువు గురించి పలుమార్లు బహిరంగ వేదికలపై చెప్పారు. తనకు విద్యాబుద్ధులు నేర్పింది తన గురువు వెంకటప్పగారని చాలా గర్వంగా చెప్పుకునేవారు. ఇందుకోసమే తన సొంత ఊరు పులివెందులలో గురువు వెంకటప్ప పేరుతో ఒక పాఠశాలను నిర్మించి అక్కడ విద్యార్థులు ఉచితంగా చదువుకునే ఏర్పాటు చేశారు.
గురుదక్షిణలో భాగంగా వెంకటప్ప స్కూలు
దేశ భవిష్యత్తు అయిన చిన్నారులకు విద్య అనేది తప్పనిసరి అని భావించిన వైయస్... వెంకటప్ప స్కూలులో కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని భావించారు. ఈ స్కూలులో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో ఉండే చదువులు చెబుతున్నారు. నాడు విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించాలని వైయస్ కలలుగన్నారు. ఈ ఆలోచనకు ముందుగా పులివెందులలోని వెంకటప్ప స్కూలు నుంచే అడుగుపడింది. తనకు విద్యాబుద్దులు నేర్పిన వెంకటప్ప మాష్టారు గారికి తన పేరు మీద స్కూలు నిర్మించి ఉచిత విద్యను అందించడం గురుదక్షిణలా భావించారు వైయస్.
వైయస్ కలలను సాకారం చేసిన జగన్
ఇక వైయస్ కన్న కలలను నిజం చేయాలని భావించారు అప్పటి కడప ఎంపీగా ఉన్న ఇప్పటి ఏపీ సీఎం వైయస్ జగన్. నాడు వెంటనే వైయస్ఆర్ ఫౌండేషన్ కింద వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూలును బాకరాపురంలోని 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 2007-08 విద్యాసంవత్సరం నుంచి స్కూలు ప్రారంభమైంది. ఈ స్కూలులో మౌలిక సదుపాయాలు కూడా భేష్ అనేలా ఉన్నాయి. మొత్తంగా 46 తరగతి గదులు ఉండగా ఒక లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ రూమ్, రీడింగ్ హాల్, ఆడియో విజువల్ రూమ్ మరియు స్టోర్ రూమ్లు ఉన్నాయి. ఇక ఇందులో టీచర్ల సంఖ్య కూడా బాగానే ఉంది.
విద్యార్థులకు అన్నీ ఉచితమే
ఇక విద్యార్థులను ఇంటి నుంచి స్కూలుకు తిరిగి స్కూలు నుంచి ఇళ్లకు చేర్చేందుకు బస్సులు కూడా ఉన్నాయి. ఇక విద్యార్థులకు అయ్యే ఖర్చు అంటే ట్యూషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, యూనిఫారం, బుక్స్లాంటి వాటికి అంతా వైయస్ఆర్ ఫౌండేషనే భరిస్తోంది. ఇక ఈ స్కూలులో వైట్ కార్డు ఉన్న స్థానికుల పిల్లలకు అడ్మిషన్ ఇస్తారు. పిల్లల చదువు కొస్తే మంచి నాణ్యతతో కూడి విద్యను వెంకటప్ప స్కూలులో అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇక ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది. ప్రస్తుతం సీఎం జగన్ బిజీగా ఉండటంతో వైయస్ భారతి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
Recommended Video
వైయస్ భారతి పర్యవేక్షణలో..
వాస్తవానికి సీఎం వైయస్ జగన్ తన హైదరాబాదులోని బేగంపేట్లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యనభ్యసించారు. కానీ ప్రతి ఒక్కరికి మంచి విద్య అందాలన్న ఉద్దేశంతో వైయస్ రాజశేఖరరెడ్డి గురువు వెంకటప్ప పేరుతో స్కూలును ప్రారంభించారు. కడప ఎంపీగా ఉన్న సమయంలో ఆ స్కూలుకు వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించేవారు. ఆ తర్వాత సీఎం జగన్ బిజీ అయిపోవడంతో ఆయన సతీమణి వైయస్ భారతి అన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.