ఒత్తిడితో హైదరాబాద్లో టెక్కీ ఆత్మహత్య, టెక్కీ విద్యార్థి
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన ఓ వ్యాపారి కుమారుడు రాజశేఖర్ రెడ్డి రెండేళ్లుగా నానక్ రాంగూడలోని ఓ సాఫ్టువేర్ సంస్థలో పని చేస్తున్నాడు. అతని వయస్సు ఇరవై నాలుగేళ్లు. రాయదుర్గం సాయినగర్లో అదే కంపెనీలో పని చేసే మరో మిత్రుడితో కలిసి ఉంటున్నాడు.
మిత్రుడు ఉదయం ఎనిమిది గంటలకు ఉద్యోగం కోసం వెళ్లాడు. రాజశేఖర్ రెడ్డి తనకు పది గంటలకు డ్యూటీ ఉందని చెప్పాడు. ఇంట్లోనే ఉండిపోయాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదు.
దీంతో రాజశేఖర్ రెడ్డి తమ్ముడు ఈ విషయాన్ని అదే రూంలో ఉంటున్న మిత్రుడుకి చెప్పాడు. మధ్యాహ్నం రెండు గంటలకు మిత్రుడు వచ్చి చూశాడు. రాజశేఖర్ రెడ్డి ఉరి వేసుకొన్నాడు. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
టెక్కీ విద్యార్థి కూడా
సాఫ్టువేర్ శిక్షణ కోసం హైదరాబాదుకు వచ్చిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన చంద్రశేఖర్ శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చాడు. వసతి గృహంలో ఉంటున్నాడు. సోమవారం గదిలో ఎవరు లేని సమయంలో బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.