పుష్కరాల్లో అపశ్రుతులు: టెక్కీని మింగేసిన గోదారి, యువతి మునక
ఏలూరు: గోదావరి పుష్కరాల్లో అపశృతులు చోటుచేసుకుంది. పుష్కర స్నానానికి వెళ్లిన మురళీకృష్ణ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. ప్రమాదంలో ఉన్న మరో ఉద్యోగిని స్థానికులు కాపాడారు. పుష్కర ఘాట్ జలాల్లో రక్షణ కంచె దాటి లోపలికి వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. మృతుడి స్వస్థలం ముప్పిడివారి పాలెం అని తెలిసింది.
గుండెపోటుతో వృద్ధురాలి మృతి
ఇదిలావుంటే, కొవ్వూరు గోష్పాదక్షేత్రం దగ్గర గుండెపోటుతో వృద్ధురాలు మృతి చెందారు. మృతురాలి స్వస్థలం దెందులూరు మండలం కొవ్వలి గ్రామమని పోలీసులు చెప్పారు. మరో సంఘటనలో కొవ్వూరు సుబ్రమణ్యం ఘాట్ దగ్గర బస్సు నుంచి జారిపడి వృద్ధురాలికి గాయాలయ్యాయి.
గోదారిలో మునిగి యువతి మృతి
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని గోష్పాద రేవు దగ్గర పుష్కర స్నానాల్లో మరో మరణం సంభవించింది. గోదావరి నదిలో యువతి మునిగి మృతిచెందింది. ఈ సంఘటనతో పుష్కరఘాట్లో విషాదం అలుముకుంది.
పోటెత్తిన భక్తులు
తెలుగు రాష్ర్టాల్లో పుష్కరాలు శుక్రవారానికి నాలుగవ రోజుకు చేరుకున్నాయి. రాజమండ్రి, నర్సాపురం, కొవ్వూరు, భద్రాచలం, ధర్మపురి, బాసర, కాళేశ్వరంలలోని గోదావరి పుష్కర ఘాట్లలో తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు చేయడం ఆరంభించారు.
భధ్రాచలంలోని పుష్కర ఘాట్లో భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు చేసేందుకు తరలివస్తున్న భక్తులతో పుష్కరఘాట్లు కిటకిటలాడుతున్నాయి. రాజమండ్రిలోని పుష్కర ఘాట్లో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో రెండు రాష్ర్టాల్లోనూ పోలీసులు పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.