జలపాతంలో పడి టెక్కీ మృతి, ఔటర్ ప్రమాదంలో ఐఐటీ విద్యార్థి
ఔటర్లో ఐఐటీ విద్యార్థి మృతి
ఔంటర్ రింగ్ రోడ్డులో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మేడ్చల్ పరిధిలోని ఓటర్ రింగ్ రోడ్డు పైన ఓ కారు డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టడంతో కారులో ఉన్న ఐఐటీ విద్యార్థి సీహెచ్ రామలింగ రాజు మరణించారు. శామీర్ పేట మండలం తూంకుంట వాసి అయిన రామలింగ రాజు మద్రాస్ ఐఐటీలో ఫైనలియర్ చదువుతున్నాడు.
సెలవుల్లో ఇక్కడకు వచ్చిన రాజు శనివారం కారులో శామీర్ పేట నుండి మేడ్చల్ వస్తూ మునిరాబాద్ పరిధిలో ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టాడు. అతని వయస్సు 23.
మోసగించిన కేసులో ఐదుగురి అరెస్ట్
సౌదీ రియాళ్లు ఇస్తామని మోసగించిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, శనివారం నాడు రిమాండుకు తరలించారు. కంచన్ బాగ్కు చెందిన మహ్మద్ నసీరుద్దీన్ అమీర్ పేటలోని గురుద్వార వద్ద ప్లాస్టిక్ సామాగ్రిని విక్రయిస్తుంటాడు. ఈ నెల 14వ తేదీన పశ్చిమ బెంగాల్కు చెందిన రషీదా బేగం సామాగ్రిని కొనుగోలు చేసింది.
అతనితో మాటలు కలిపి తన ఫోన్ నెంబర్ ఇచ్చింది. సౌదీకి చెందిన ఒక రియాల్ నోటు ఇచ్చి చలామణి చేసి ఇవ్వాలని కోరింది. దానిని మార్చగా రూ.1600 వచ్చింది. ఆ డబ్బు తీసుకొనేందుకు హుస్సేన్ అనే వ్యక్తితో కలిసి నసీరుద్దీన్ వద్దకు వచ్చిన ఆమె అతడిని అన్నగా పరిచయం చేసింది.
డబ్బు తీసుకొని రూ.4 వందలు ఇచ్చింది. తన వద్ద మరో 300 రియాళ్లు ఉన్నాయని, వాటిని మారిస్తే కమీషన్ ఇస్తానని తెలిపింది. ఆశపడ్డ నసీరుద్దీన్ రూ.3 లక్షలు ఇచ్చి 600 రియాళ్ల నోట్లు తీసుకున్నాడు. తర్వాత వాటిని చూసి మోసపోయానని గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రషీదా బేగం, ఫర్వీన్ బేగం, హుస్సేన్, బిలాల్, జాషిన్లను అరెస్టు చేశారు.