పేరెంట్స్ ప్రేమ కరువైందనే: టెక్కీ ఆత్మహత్యలో ట్విస్ట్
హైదరాబాద్: తల్లిదండ్రుల ప్రేమ కరువైందని ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఒక్కగానొక్క కొడుకును అయినప్పటికీ ఆడపిల్లల పైనే ప్రేమను చూపిస్తున్నారని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం రాత్రి మాచవరం డౌన్లోని ప్రతిభానికేతన్ రోడ్డులో కృష్ణమూర్తి అనే టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహానికి మాచవరం పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.
కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు వీరయ్య, శివపార్వతి, భార్య గీత మంగళవారం ఆసుపత్రికి చేరుకొని తీవ్రంగా రోదించారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కృష్ణమూర్తి ఆత్మహత్యకు ముందు రెండు లేఖలు రాశాడు. అందులో ముఖ్యంగా తల్లిదండ్రులు తనను చిన్నచూపు చుస్తున్నారని, తన సోదరిలపై చూపిస్తున్న ప్రేమ తనపై చూపడం లేదని ఆ లేఖలో పేర్కొన్నాడని తెలిపారు.
అంతేకాకుండా బిల్డర్ మహేష్ తనను మోసం చేశాడని రాశాడు. అజిత్ సింగ్ నగర్లో టెక్కీ తండ్రికి 380 గజాల భూమి ఉంది. దీనిని ఇటీవల మహేష్ అనే బిల్డర్కు అభివృద్ధి కోసం ఇచ్చారు. అయితే ముందు నుండి ఈ భూమిని తండ్రి తనకు ఇస్తాడని కృష్ణమూర్తి భావించాడు. కానీ బిల్డర్కు ఇచ్చారు. విషయం తెలిసిన టెక్కీ కృష్ణమూర్తి తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అనంతరం సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కృష్ణమూర్తి హైదరాబాదులోని నోవాటీస్ అనే సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు లక్ష రూపాయల వేతనం. భార్య గీత కూడా సాఫ్టువేర్ ఇంజనీరే. కానీ, తల్లిదండ్రులు తన పైన ప్రేమ చూపించడం లేదని బలవన్మరణానికి పాల్పడటం విషాదకరం. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారని తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం కృష్ణమూర్తి మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.