టెక్కీ మావోయిస్టు సరెండర్: భ్రమలు తొలిగాయని వ్యాఖ్య
విశాఖపట్నం: ఐటిలో బిటెక్ చేసిన మావోయిస్టు వంతల బాలకృష్ణ నాయుడు అలియాస్ వివేక్ పోలీసులకు లొంగిపోయాడు. మావోయిస్టు ఉద్యమంలో ఆయన 2017లో చేరాడు. పోలీసు సూపరింటిండెంట్ (విశాఖ రూరల్) రాహుల్ దేవ్ శర్మ ముందు అతను మంగళవారంనాడు లొంగిపోయాడు.
బాలకృష్ణ నాయుడు 2012లో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఐటిలో బిటెక్ పూర్తి చేశాడు. కొన్నేళ్ల పాటు ఫార్మాస్యూటికల్ రంగంలో పని చేసి, బంధువుల ప్రేరణతో 2017లో మావోయిస్టు ఉద్యమంలో చేరాడు.
విశాఖ ఏజెన్సీసోని జి మాడుగుల గ్రామానికి చెందిన 28 ఏళ్ల టెక్కీ ఎవోబీలో పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నాడు. అతనిపై రూ.4 లక్షల రివార్డు ఉంది. తమ ప్రాంతంలోని వెనకబడిన గిరిజనుల జీవనశైలిలో మార్పు తెస్తుందని ఉద్దేశంతో తాను మావోయిస్టు ఉద్యమంలో చేరానని, అయితే తనకు ఆ భ్రమలు తొలిగాయని బాలకృష్ణ నాయుడు మీడియాతో అన్నారు. మావోయిస్టు సిద్ధాంతం ప్రస్తుత కాలానికి పనికి రాదని అన్నాడు.
ఆటంకాలు కలిగిస్తూ మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కూడా అతను ఆరోపించాడు. విశాఖ ఏజెన్సీలోని చాలా ప్రాంతాల్లో అభివృద్ధి అనేది కంటి తుడుపు చర్య మాత్రమేనని గిరిజనుడిగా తాను చెబుతున్నట్లు తెలిపాడు.
తన బావ తౌడు బాబు, తన బాల్య మిత్రుడు చికుడ చిన్నారావు అలియాస్ సుధీర్ ప్రేరణతో తాను మావోయిస్టులతో చేరినట్లు తెలిపాడు. తాను విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో పనచేశానన, అందువల్ల మావోయిస్టు ఉద్యమంలో చేరడానికి తాను పెద్దగా జంకలేదని అయితే, తన ప్రయాణం త్వరగానే ముగిసిందని అన్నాడు
బాలకృష్ణ నాయుడు రెండు ఎన్కౌంటర్లలో పాల్గొన్నట్లు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. బాలకృష్ణ నాయుడు మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కేకు, గాజర్ల రవి అలియాస్ ఉదయ్కి సన్నిహితుడని చెప్పారు.