క్యాంప్నకు చేరుకున్నామని చెప్పింది, ఆ తర్వాతే..: గల్లంతైన మహిళా టెక్కీ తండ్రి
హైదరాబాద్: తమ బిడ్డ ఎంతో ధైర్యవంతురాలని, తిరిగి వస్తుందని తమకు ఆ నమ్మకం ఉందని పర్వతారోహణకు వెళ్లి ఆచూకీ తెలియకుండా పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీలిమ తండ్రి శౌరయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యున్నతమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని వెళ్లిన నీలిమ, నేపాల్లో సంభవించిన భూకంపం తరవాత ఆచూకీ తెలియకుండా పోయారు.
దాంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హైదరాబాదులోని మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన శౌరయ్య న్యాయవాది. తల్లి ఓ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వీరికి కూతురు నీలిమ గండిపేట ఎంజిఐటిలో బిటెక్ను పూర్తి చేసుకుని కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తుంది. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన 22మంది బృందంతో ఎవరెస్టు శిఖరాన్ని ఆధిరోహించేందుకు భారత ప్రభుత్వం నుంచి ఎంపికైంది.
ఈ క్రమంలో ఈనెల 18న ఇంటి నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి 19న ఖాట్మండుకు వెళ్లింది. బుధవారం తమకు ఫోన్ చేసి మాట్లాడిందని తండ్రి శౌరయ్య తెలిపారు. క్యాంప్నకు చేరుకుంటున్నామని, సముద్ర మట్టానికి నాలుగువేల ఆరు వందల మీటర్లు ఎత్తులో ఉందని ఫోన్లో సమాచారం అందించిందని తండ్రి చెప్పారు.
కాగా ఆదివారం భూకంపం తర్వాతనుంచీ తమకు ఎలాంటి సమాచారం లేదని, అయితే ఆమెతో వెళ్లిన అమెరికాకు చెందిన తోటి అమ్మాయిల సమాచారం అందిందని దీంతో తమ బిడ్డ కూడా సురక్షితంగా ఉంటుందని తండ్రి చెప్పారు.