భార్య ప్రేమాయణం: ప్రియుడితో కలిసి భర్తని చంపిన టెక్కీ
తనకు ఇష్టం లేకున్నా తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు వెంకటేశ్వర రావును పెళ్లి చేసుకున్న సౌజన్య స్నేహితులతో కలిసి పథకం ప్రకారం భర్తను హత్య చేసినట్లు చెప్పారు. ఈ నెల 14వ తేదిన వెంకటేశ్వర రావు, సౌజన్యలు సంఘీ దేవాలయానికి వెళ్లి వస్తుండగా వారి పైన కొందరు దుండగులు దాడి చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తన భర్తను చంపేశారని, తనను గాయపర్చి దోచుకెళ్లారని సౌజన్య అప్పుడు చెప్పింది. దోపిడీ కోసం హతమార్చినట్లుగా నమ్మించేందుకు సౌజన్య స్నేహితులు ఆమెను కత్తితో గాయపర్చారు. కేసును ఛేదించిన పోలీసులు భార్యను నిందితురాలిగా గుర్తించారు. సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.
సాఫ్టువేర్ ఇంజనీర్ అయిన సౌజన్యకు, ఆర్టీసి మెకానిక్ అయిన వెంకటేశ్వర రావుకు పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారని, ఆమె అంతకుముందు వేరే యువకుడు జైదీప్ను ప్రేమించిందని, దీంతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నిందని పోలీసులు తెలిపారు.
వెంకటేశ్వర రావుతో పెళ్లి ఇష్టం లేని సౌజన్య తాను ప్రేమించిన యువకుడిని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంది. అతను కూడా సాఫ్టువేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. ఇద్దరు బెంగళూరులోనే పని చేస్తున్నారు. సౌజన్య ప్రతి శుక్రవారం రాత్రి బెంగళూరు బయలుదేరి శనివారం ఉదయం హైదరాబాదుకు వచ్చేది.
ఈ నేపథ్యంలో 13న సౌజన్య హైదరాబాదుకు వచ్చింది. జైదీప్ కూడా నగరానికి వచ్చి స్నేహితుడు రాజ్ కుమార్ సహకారం కోరాడు. శనివారం దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంపై సంఘీ దేవాలయానికి వెళ్లారు. రాత్రి ఏడున్నర గంటలకు తిరిగి ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యలో సౌజన్య ఉద్దేశ్యపూర్వకంగా వెంకటేశ్వర రావును నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లింది. అప్పటికే అక్కడ ఉన్న జైదీప్, రాజ్ కుమార్లు అతనిని హత్య చేశారు.