బాబుకు తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల లేఖ, మహానందిలో తెలంగాణ మంత్రి కారు
హైదరాబాద్/కర్నూలు: తెలంగాణ రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అగ్రిగోల్డ్ బాధితులు లేఖ రాశారు.
ఎన్నో ఏళ్లుగా పేదలు, మధ్య తరగతి ప్రజల నుంచి వందల కోట్ల రూపాయల డబ్బు వసూలు చేసిన అగ్రిగోల్డ్ సంస్థకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కస్టమర్లున్నారు. ఇప్పుడు కేసు ఏపీ పరిధిలో ఉండటం, ఆ సంస్థ ఆస్తులు అమ్మి న్యాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో తమకు కూడా న్యాయం జరిగేలా చూడాలని తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం చంద్రబాబును కోరింది.
అగ్రిగోల్డ్లో ఏజంట్లుగా పని చేసిన వారిపై దాడులు జరుగుతున్నాయని, ఇప్పటికే పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమ డబ్బు తమకు ఇప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
మహానందిలో తెలంగాణ మంత్రి కారు
నీలం రంగు కలిగిన బుగ్గకారు ఒకటి శనివారం నాడు రాత్రి కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలోని ఆలయ ముఖద్వారం వరకు వచ్చింది. ఆలయం ముందుభాగం వరకు కారులోనే వెళ్లాలని చూశారు.
అయితే, భద్రతా సిబ్బంది ఆపేశారు. వివరాలు అడగగా.. తాను తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు తనయుడిని అని, మిత్రులతో కారులో వచ్చానని చెప్పారు.
నిబంధనల ప్రకారం కారును లోపలకు అనుమతించమని చెప్పడంతో కారు మరోచోట పెట్టి వెళ్లారు. కాగా, ప్రభుత్వ పనులకు, అదీ మంత్రి మాత్రమే వాడాల్సిన కారును ఇలా ఆయన కుమారుడు మిత్రులతో కలిసి వాడుకోవడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.