తెలంగాణపై మంత్రుల బృందానికీ ఆంటోనీ నేతృత్వం
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మంత్రుల బృందం ఏర్పటైంది. ఈ కమిటీకి కూడా రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీయే నేతృత్వం వహించనున్నారు. కాంగ్రెసు పార్టీ తరఫున వేసిన కమిటీకి ఆయన నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు పి. చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేష్ సభ్యులుగా ఉంటారు.
నారాయణ స్వామి ప్రత్యేక ఆహ్వానితుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రానికి చెందిన మంత్రులకు ఇందులో చోటు దక్కలేదు. విభజన వల్ల తలెత్తే సమస్యలను ఈ బృందం వింటుంది. నదీ జలాలు, హైదరాబాద్, రెవెన్యూ పంపకాలు, ఉద్యోగాల వంటి విషయాలపై ఈ మంత్రుల బృందం సమాచారం సేకరిస్తుంది.
కాగా, సమైక్యాంధ్ర కోసం హైదరాబాదులో దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన చికిత్సకు నిరాకరిస్తున్నారు. ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నా ఆయన వినడం లేదు. స్వల్పమైన వెన్నునొప్పితో ఆయన బాధపడుతున్నారు. షుగర్ లెవెల్స్ తగ్గినట్లు తెలుస్తోంది. ఆయన గత మూడు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఇదిలావుంటే, విభజన తీరును నిరసిస్తూ ఢిల్లీలో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. ఆయనను వైద్యులు పరీక్షించారు. ఆయన ఆరోగ్యంపై మాట్లాడడానికి వైద్యులు నిరాకరించారు. దీక్షకు చేసిన ఏర్పాట్లను తొలగించాలని నోటీసులు జారీ చేసిన ఎపి భవన్ కమిషనర్తో తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చలు జరిపారు.