తెలంగాణ, ఏపి రాజకీయాల్లో ఎంతో వ్యత్యాసం..! ఏపి నేతల తాపత్రయం దేనికి.?విసిగెత్తి పోతున్న ఏపి ప్రజలు.
అమరావతి/హైదరాబాద్ : దేశం మొత్తంతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎంతో వైవిధ్యంగా సాగుతుంటాయి. సాధారణ ఎన్నికల నుండి సారా వ్యాపారం దాకా రాజకీయం తారాస్థాయిలో నడుస్తుంటుంది. రాజకీయ నాయకులు కూడా అందుకు తగ్గట్టుగానే ప్రత్యర్ధులను మానసికంగా హత్య చేసేందుకు తమ నోటికి ఎప్పటికప్పుడు పదునుపెంచుకుంటూ పోతారు. సమయం, సందర్బం, విషయం, విజ్ఞత, పెద్దా, చిన్నా తారతమ్యం లేకుండా వ్యవహరిస్తుంటారు. ఒకరిపై మరొకరు ఆదిపత్యం చాటుకోవడానికి సర్కస్ విన్యాసాలను మించి సాహసాలు చేస్తుంటారు.
ఏపిలో ఆదిపత్య రాజకీయాలు... ఈ సమయంలో ఏంటని పెదవి విరుస్తున్న ప్రజలు..
అంతే కాకుండా నేతల దిగజారుడు వ్యవహారం గమనించిన ప్రజలు కొన్ని సందర్బాల్లో రాజకీయ నేతలను ఛీత్కరించుకున్న సందర్బాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తూ మానవాళి మీద మృత్యు పంజా విసరాలని చూస్తున్న సమయంలో కూడా చిత్ర విచిత్ర రాజకీయాలకు తెరతీస్తున్నారు ఏపి రాజకీయ నాయకులు. కరోనా కష్ట కాలంలో కలిసికట్టుగా పోరాటం చేయాల్సింది పక్కన పెట్టి సిల్లీ రాజకీయాలతో రచ్చ కెక్కుతున్నారు నేతలు. కరోనా మహమ్మారిని తరిమికొట్టే అంశంలో రాజకీయాలను పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవలో పదోవంతు కూడా ఏపి ప్రభుత్వం చూపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో రాజకీయాలకు చెక్.. కరోనాను తరిమికొట్టడమే నేతలందరి లక్ష్యం..
తెలంగాణలో కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ఏకాభిప్రాయాన్ని చాటుతున్న ప్రజల మాదిరిగానే రాజకీయ నేతలు కూడా రాజకీయాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రికి సహకరిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. రాజకీయ ఆరోపణలకు తావు లేకుండా లాక్ డౌన్ సమయంలో నిరుపేదలకు అందాల్సిన రాయితీల గురించి మాత్రమే నిలదీస్తున్నారు తెలంగాణ ప్రతిపక్ష పార్టీ నాయకులు. ఏపిలో మాత్రం ఇందుకు విరుద్దంగా రాజకీయాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టే అంశంలో ప్రతిపక్ష పార్టీల సలహాలు సూచనలు తీసుకోవాల్సిన తరుణంలో, అలాంటి చర్యలకు అధికార పార్టీ ఏమాత్రం తావివ్వడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు చొరవ తీసుకుని తగు సూచనలు ఇస్తున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదనే చర్చ జరుగుతోంది.
ప్రతిపక్షాల సలహాలకు నో ఛాన్స్.. ఆదిపత్య రాజకీయాలే ముఖ్యమంటున్న నేతలు..
ప్రకృతి ప్రకోపించి హుద్ హుద్ లాంటి తుపాను ఉత్తరాంధ్రను తుడిచిపెట్టేసినా యుద్ద ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు పునరుద్దరించగలిగారు. విశాఖపట్టణం లాంటి నగరం హుద్ హుద్ తుపాను ముందు, తర్వాత అన్నంతాగా అభివృద్ది చేసి చూపించారు చంద్రబాబు. ప్రస్తుత కరోనా క్లిష్ట సమయంలో చంద్రబాబు సలహాలను తీసుకునే స్థితిలో ఏపి ప్రభుత్వం లేదనే చర్చ కూడా జరుగుతోంది. అంటే సమస్య మీద పోరాటం చేసి విజయం సాధించడం కన్నా రాజకీయాలే ముఖ్యమనే దిశగా ఏపి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.
రాజకీయాలపై ఉన్న శ్రద్ద కరోనా మీద లేదు.. ఆందోళన కలిగిస్తున్న కేసుల సంఖ్య..
అంతే కాకుండా కరోనా మహమ్మారి కన్నెర్ర చేస్తున్న తరుణంలో, పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న సమయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరించి ప్రాణనష్టం సంభవించకుండా అప్రమత్తం చేయాల్సిన సమయంలో ఎలక్షన్ కమీషనర్ వ్యవహారం పట్ల అధికార వైసిపి పార్టీ రాజకీయం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 120దేశాలను గడగడలాడిస్తున్న భయంకరమైన కరోనా వైరస్ కన్నా ఒక ఎలక్షన్ కమీషన్ అంశం ఏపి ప్రభుత్వానికి పెద్దదిగా కనిపిస్తోందా అనే చర్చ జరుగుతోంది.
Recommended Video
తెలంగాణలో రాజకీయాలు వద్దు.. కరోనాను తరిమికొట్టడమే లక్ష్యం అంటున్న నాయకులు..
రాజకీయ ఆదిపత్యానికి ఇస్తున్న ప్రాధాన్యత కరోనా పాజిటీవ్ కేసులు ఎందుకు పెరుగున్నాయనే అంశానికి ఇస్తే సామాన్యుల ప్రాణాలు కాపాడినట్టవుతుందనే చర్చ కూడా జరుగుతోంది. రాజకీయాలు చేయడానికి కూడా ఓ సమయం, సందర్బం ఉంటుందని, నేతలు ఆ దిశగా స్పందించి తమ విజ్ఞతను చాటుకున్నప్పుడే అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుందన్న తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు వ్యాఖ్యలను ఏపి నేతలు ఆచరించాల్సిన సమయం ఆసన్నమైందనే చర్చ కూడా ఏపి ప్రజల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది.