తెలంగాణా,ఎపిల్లో పరిస్థితులు వేరు...మీకు ఎందుకు భయం:కాంగ్రెస్ తో పొత్తుపై బోండా ఉమా
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్తో పొత్తు ఉంటుందని తాము ఎక్కడా చెప్పలేదని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టీఆర్ఎస్ని ఓడించేందుకే మహాకూటమిలో కలిశామని బోండా ఉమా వివరించారు.
ఆంధ్రప్రదేశ్...తెలంగాణల్లో పరిస్థితులు వేరు వేరన్నారు. తెలంగాణకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు. తాము కాంగ్రెస్ తో కలుస్తామనగానే బీజేపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని బోండా ఉమా ప్రశ్నించారు. జీవీఎల్ నరసింహారావు గతం మరచిపోవద్దని...ప్రధాని అభ్యర్థిగా మోడీ అసలు ఎమ్మెల్యేలు కాని వారిని కూడా పిలిపించుకొని మాట్లాడారని బోండా ఉమ గుర్తు చేశారు.
అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు వెళ్లి, అందరినీ కలిసి వచ్చారని...ఆనాటి విషయాలు మళ్లీ ఒక్కసారి గుర్తుచేసుకోమన్నారు. మీలాంటి వారు చేసే విమర్శలను ప్రజలు తిప్పికొడతారని బోండా ఉమ వ్యాఖ్యానించారు. అఖిలేష్ యాదవ్ని బచ్చా అంటున్న ఎంపి జివిఎల్ ఆయన మాజీ సీఎం, ఎస్పీ అధ్యక్షుడని మరచిపోవద్దని అన్నారు.
భయంతోనే బీజేపీ నేతలు ఇలా నోరు పారేసుకుంటున్నారని బోండా ఉమ విమర్శించారు. దేశంలో ప్రస్తుతం జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి అవసరం ఎంతైనా ఉందన్నారు. భావసారూప్యతగల పార్టీలన్నింటితోనూ మాట్లాడుతున్నామని, కలిసి వస్తామంటేనే కాంగ్రెస్తో మాట్లాడుతున్నామని బోండా ఉమ వివరించారు.
దేశంలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్న బీజేపీని గద్దెదించడమే తమ లక్ష్యమని బోండా ఉమ తేల్చిచెప్పారు. చంద్రబాబు ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వానికి ఇవి ఆఖరి రోజులని, జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ కీలక పాత్ర పోషించబోతోందని బోండా ఉమా జోస్యం చెప్పారు.