వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ నోట్: సీమాంధ్ర పట్టుకు మూడు ముక్కలాట

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రూపొందించిన నోట్‌కు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యం రాష్ట్రంలోని ముగ్గురు ముఖ్య నేతల మధ్య పోరును రాజేసినట్లు కనిపిస్తోంది. విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి‌లు పోటీ పడుతున్నారు.

కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలపడం పట్ల జగన్మోహన్‌రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శనివారం నుంచి రాష్ట్ర విభజనకు నిరసనగా ఆమరణ దీక్ష చేయనున్నట్లు ఆయన శుక్రవారం ప్రకటించారు. విభజన ప్రక్రియను కాంగ్రెస్ అధిష్టానం విరమించుకునే వరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఇప్పటికే తమ పార్టీ నాయకులతోపాటు జగన్మోహన్ రెడ్డి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందె. అక్టోబర్ 19న హైదరాబాద్‌లో సమైక్య సభను కూడా నిర్వహిస్తామని ఇటీవల తెలిపారు.

Jagan Reddy, Kiran Reddy and Chandrababu Naidu

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే తాను సమైక్యవాదినని ప్రకటించుకున్నాడు. తాను సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రినని, రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించమంటూనే రాష్ట్ర విభజనను అంగీకరించబోమని కిరణ్‌కుమార్ రెడ్డి చెబుతున్నారు. రాష్ట్ర విభజనతో నీటి సమస్యలతోపాటు అనేక సమస్యలు ఎదురవుతాయని అందువల్ల రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయకుండా అసెంబ్లీకి వచ్చే తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని పార్టీ నేతలకు సూచించారు. తీర్మానాన్ని ఓడించి విభజనకు తాము అనుకూలంగా లేమనే సందేశాన్ని అధిష్టానానికి పంపాలని యోచిస్తున్నారు. మరోవైపు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి శనివారం తిరుపతిలో పర్యటించనున్నారు.

రాష్ట్ర విభజన నోట్‌ను కేంద్రం ఆమోదించడంతో చంద్రబాబునాయుడు కూడా సీమాంధ్ర ప్రజల్లోకి వెళ్లి వారి సానుభూతిని పొందాలను చూస్తున్నారు. విభజనతో సీమాంధ్రకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని, ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేలా ఉంటేనే రాష్ట్రాన్ని విభజించాలని కోరుతున్నట్లు ప్రజల్లోకి సందేశాలు పంపుతున్నారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేయకుండా విభజన చేపట్టిన కాంగ్రెస్ వైఖరికి నిరసనగా సీమాంధ్ర ప్రాంతంలో బస్సు యాత్ర చేపట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారు. కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే డిమాండ్‌తో చంద్రబాబు నాయుడు సోమవారం నుంచి ఢిల్లీలో దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇది ఇలా ఉండగా తెలంగాణ నోట్‌కు కేంద్రమంత్రి వర్గం ఆమోదించిన నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. సీమాంధ్రకు చెందిన పలువురు రాష్ట్ర, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. మరికొంతమంది రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమం కొనసాగుతూనే ఉంది.

English summary
The Union cabinet's approval for the formation Telangana state has set off a triangular fight among YSR Congress president YS Jaganmohan Reddy, TDP president N Chandrababu Naidu, and Andhra Pradesh chief minister N Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X