పొలిటికల్ స్పీచ్లు వద్దు: రాజయ్యపై అక్బర్ ఫైర్
హైదరాబాద్: డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి టి. రాజయ్య తీరుపై మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలపై ప్రభుత్వ తీరును విమర్శిస్తూ రాజకీయ ప్రసంగాలు వద్దని, తమకు స్పష్టమైన సమాధానం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో అక్బరుద్దీన్ తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల తీరును మంత్రి దృష్టికి తెచ్చారు.
నీలోఫర్, గాంధీ, క్యాన్సర్ ఆస్పత్రులు చూడాలని, వాటిలో ఏ మాత్రం సౌకర్యాలు లేవని, సెక్యూరిటీ గార్డులు కూడా లేరని అక్బరుద్దీన్ అన్నారు. ఆస్పత్రుల్లో అవసరమైన మేరకు వైద్య సిబ్బంది లేకపోవడాన్ని ప్రతిపక్షాల సభ్యులు మంత్రి దృష్టికి తెచ్చారు. తెలంగాణలోని ఆస్పత్రులను తాను సందర్శించానని, బడ్జెట్లో కూడా ఆస్పత్రుల కోసం తగిన నిధులు కేటాయించామని డిప్యూటీ ముఖ్యమంత్రి రాజయ్య చెప్పారు.
కార్పోరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రుల్లోనూ వైద్యం అందిస్తామని ఆయన చెప్పారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించామని, ప్రభుత్వాస్పత్రులను ఆధునీకరిస్తామని ఆయన చెప్పారు. హైదరాబాదులోని ఆస్పత్రులకు రూ.552 కోట్లు కేటాయించామని, ప్రభుత్వాస్పత్రులను ఆధునీకరిస్తామని ఆయన అన్నారు. వైద్యుల కొరతను త్వరలోనే తీరుస్తామని, సిబ్బంది నియామకాలను త్వరలో చేపడుతామని ఆయన చెప్పారు.
అక్రమాలపై చర్యలు తీసుకుంటాం..
రాష్ట్రంలోని పాఠశాలలు అన్నింటికీ సరైన సమయంలోనే పాఠ్యపుస్తకాలు అందించామని తెలంగాణ రాష్ట్ర విద్యా మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. మంగళవారంనాడు శాసనసభలో కాంగ్రెసు సభ్యుడు వంశీచంద్ రెడ్డి వేసిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. సామాజిక శాస్త్రం పుస్తకాలు సరఫరా చేయడంలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. కొన్ని కార్పోరేట్ సంస్థలు పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నాయని ఆయన చెప్పారు.
అధిక ధరలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగు అకాడమీలో జరిగిన అవకతవకలు, సకాలంలో పాఠ్యపుస్తకాల పంపిణీలపై ప్రతిపక్షాల సభ్యులు ప్రశ్నలు సంధించారు. తెలుగు అకాడమీలో అవకతవకలు జరిగినట్లు ఏ విధమైన ఫిర్యాదు రాలేదని మంత్రి స్పష్టం చేశారు.
ఐదేళ్లుగా కొన్ని కార్పోరేట్ సంస్థలు ఇంటర్మీడియట్ బోర్డును ఏలుతూ ఇష్టం వచ్చినట్లు జీవోలు ఇప్పించుకున్నాయని, గతంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. విద్యార్థులపై భారాన్ని కూడా తగ్గిస్తామని జగదీష్ రెడ్డి హామీ ఇచ్చారు.