శీతాకాలం సమావేశాల్లోనే టీ బిల్లు: షిండే, కిరణ్పై క్లారిటీ
న్యూఢిల్లీ/ హైదరాబాద్: పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రతిపాదిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. గురువారంనాడు జివోఎం ముందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాకపోవడంపై ఆయన కూడా ఆయన వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం కారణంగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జీవోఎం ముందుకు రాలేకపోయారని ఆయన స్పష్టం చేశారు.
ఈ నెల 18వ తేదీన జీవోఎం ముందు హాజరు కావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించామని, ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత కేబినెట్ నోట్పై దృష్టి పెడుతామని ఆయన చెప్పారు. వచ్చే కేబినెట్ సమావేశంలో తెలంగాణ నోట్ వస్తుందో రాదో చెప్పలేనని ఆయన అన్నారు. ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి జీవోఎం సమావేశానికి హాజరవుతారని ఆయన చెప్పారు.
కాగా, రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ముందుకు సాగుతోందని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు విమర్శించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని తాము బిజెపి, ఎస్పీ, సిపిఐ, జెడియు నాయకులను కోరామని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. చట్టవిరుద్ధంగా జరిగితే, న్యాయం చేయకపోతే వ్యతిరేకిస్తామని బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ చెప్పినట్లు ఆయన తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసమే విభఝనకు పూనుకున్నారని ఆయన విమర్శించారు. భద్రాచలం వంటి చిన్న విషయాలపై మాత్రమే కాకుండా ఇంకా చాలా వివాదాలు ఉన్నాయని ఆయన అన్నారు. విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. కొత్త సిఎం వచ్చినా సమైక్యానికే కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. జివోఎం ముందు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పలేదని ఆయన అన్నారు.