తెలంగాణ మంత్రివర్గం: ఇక కొత్త పారిశ్రామిక విధానం
హైదరాబాద్:నూతన పారిశ్రామిక విధానానానికి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానికి పచ్చజెండా ఊపారు. దానికితోడు ఇసుక తవ్వకం విధానం, వాటర్ గ్రిడ్ కార్పొరేషన్, సాంస్కృతిక సారథిలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇతర పలు కీలక విధానాలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగిన సమావేశంలో నూతన పారిశ్రామిక విధానం, ఇసుక తవ్వకం విధానం, వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు (ఆర్అండ్బీ), రూరల్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు (పంచాయతీరాజ్), నెడ్క్యాప్ ద్వారా రైతులకు సోలార్ పంపు సెట్ల పంపిణీ, కళాకారులను ఆదుకోవడానికి సాంస్కృతిక సారథి ఏర్పాటు, మహిళా భద్రత, మార్కెట్ కమిటీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్ఠం, సర్పంచిలకు మరిన్ని అధికారాలు, గర్భిణిలకు పౌష్టికాహారం పెంపు తదితర అంశాలకు చెందిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి బిల్లుల రూపంలో ఆమోదం పొందిన తర్వాత ఆయా విధానాలు లాంఛనంగా అమల్లోకి రానున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత మంత్రివర్గ సమావేశం జరగడం ఇది రెండోసారి. అసెంబ్లీ ప్రారంభమైన మొదటి రోజు ఈనెల 5న కేబినెట్ భేటీ జరిగింది. ఆ రోజు వార్షిక బడ్జెట్ (2014-15)కు ఆమోద ముద్ర వేశారు. ఈసారి బడ్జెట్ సమావేశాలను మరో వారం రోజులు పెంచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మరిన్ని బిల్లులకు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం కేబినెట్ సమావేశమైంది. అయితే, మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించలేదు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటమే ఇందుకు కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, నెడ్క్యాప్ ద్వారా రైతులకు సోలార్ పంపు సెట్ల పంపిణీ కోసం ఆహ్వానించిన టెండర్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ టెండర్లను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన సీఎస్ రాజీవ్ శర్మకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హుస్సేన్ సాగర్ ప్రక్షాళనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కెసిఆర్ మురుగు కాల్వల మళ్లింపునకు వంద కోట్లు విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రూ.100 కోట్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.