పదిమంది కిరణ్లు వచ్చినా టి ఆపలేరు: టి ఎమ్మెల్సీలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలాంటి వారు మరో పదిమంది వచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు ఆమోస్ మంగళవారం అన్నారు. విభజనలో ఏ లొసుగులు పెట్టినా యుద్ధమే అని హెచ్చరించారు. విభజనపై కుతంత్రాలు చేస్తే అదే వాళ్లకు చివరి రోజు అవుతుందన్నారు.
తెలంగాణ ప్రాంత మంత్రులది ముసుగులో గుద్దులాట అని మరో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేయాల్సింది పోయి బతిమాలడమేమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రోరోగ్ చేసేది లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఫైల్ పైన రాయాలని సూచించారు. తెలంగాణపై ముఖ్యమంత్రి కపట ప్రేమలు వద్దని, తమ బాధలేవో తాము పడతామన్నారు.
అసెంబ్లీ ప్రోరోగ్ కాకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రాంత మంత్రుల పైనే ఉందన్నారు. ఐబి ఆపరేషన్ రహస్యంగా ఉంటుంది కాబట్టి ఫోన్లు ఎవరు చేస్తున్నారో బయటపెట్టాలన్నారు. కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కిరణ్ను టి మంత్రులు డిమాండ్ చేయాలన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన వెనుక సీమాంధ్ర నేతల హస్తముందని ఆరోపించారు. కిరణ్ భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకోవాల్సిందే అన్నారు.
ఆగ్రహానికి గురికాక తప్పదు: టి గెజిటెడ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైతే ఆగ్రహానికి గురికాక తప్పదని తెలంగాణ గెజిటెడ్ సంఘం హెచ్చరించింది. మహిళా ఉద్యోగులు పని చేసే చాంబర్లు పారదర్శకంగా ఉండేలా చూడాలని కోరారు.