కృష్ణా జలాల్లో సమస్యలున్నాయ్! గోదావరి నీటిని పూర్తిగా వినియోగించుకోండి: కేసీఆర్
విజయవాడ: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, కుమార్తెలు వర్షారెడ్డి, హర్షా రెడ్డిలకు అభినందనలు తెలిపారు.
అనంతరం వారిద్దరూ ప్రసంగించారు. స్టాలిన్ క్లుప్తంగా మాట్లాడారు. వైఎస్ జగన్కు అభినందనలు తెలిపారు. తరువాత కేసీఆర్ మాట్లాడారు. చిన్న వయస్సులో ముఖ్యమంత్రిగా క్లిష్ట పదవిని అందుకున్నారని, దీన్ని సమర్థవంతంగా నిర్వహించగలరని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడానికి అనేక కష్టాలు, నష్టాలను వైఎస్ జగన్ ఎదుర్కొన్నారని చెప్పారు. ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా, క్లిష్ట సమస్యలనైనా ఎదుర్కొనే సామర్థ్యం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉండేదని, అలాంటి శక్తిని జగన్ వారసత్వంగా పుణికి పుచ్చుకొన్నారని చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని సామరస్యంగా, స్నేహపూరకంగా, సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకుందామని కేసీఆర్ సూచించారు. గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్ ఈ సందర్భంగా వైఎస్ జగన్కు చెప్పారు. గోదావరి జలాలను వినియోగించుకోవడం ద్వారా కొన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసుకోవచ్చని అన్నారు.
కృష్ణా జలాల పంపకాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుందామని అన్నారు. కృష్ణా జలాలకు సంబంధించిన ప్రతి నీటి చుక్కను కూడా వినియోగంలోకి తీసుకోవాలని ఆయన వైఎస్ జగన్కు సూచించారు. జలాల సద్వినియోగంతో రాష్ట్రం సుభిక్షమౌతుందని చెప్పారు. కృష్ణా జలాల పంపకాల విషయంలో ఏర్పడిన ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి తాను సహకరిస్తానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూరక వాతావరణం ఉంటేనే సమస్యలు పరిష్కారమౌతాయని అన్నారు. అలాంటి వాతావరణం నెలకొనడానికి తాను అన్ని విధాలుగా సహకరిస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
ఒక్క టర్మ్ కాదు..
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని కేసీఆర్ అకాంక్షించారు. తన తరఫున, తన తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ జగన్కు మనస్ఫర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు. వైఎస్ జగన్లో అసామాన్య పోరాట పటిమ ఉందని కొనియాడారు. అధికార పార్టీ నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. వెన్ను చూపలేదని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆదరణను చూరగొని, అఖండ విజయాన్ని సాధించారని ప్రశంసించారు కేసీఆర్. వైఎస్ జగన్ ఇప్పుడు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని, ఒక్కసారి కాదు, మూడు, నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేసీఆర్ అన్నారు.