ఉలిక్కిపడ్డ వరంగల్: జగన్ కు కేసీఆర్ ఫోన్: తెలంగాణ సర్కార్ రూ.5 లక్షల పరిహారం
వరంగల్: ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటక లాంచీ బోల్తా పడిన ఘటనలో గల్లంతైన వారిలో తెలంగాణకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వారు గల్లంతు కావడంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని కడిపి కొండలోని మహారాజా కాలనీకి చెందిన 17 మంది పాపికొండల అందాలను తిలకించడానికి వెళ్లారు. వారిలో అయిదు మంది మాత్రమే సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మిగిలిన వారి ఆచూకీ తెలియరావట్లేదు. వారి సెల్ ఫోన్లు స్విచాఫ్ లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ వారు సురక్షితంగా వస్తారా? లేదా? అనే ఆందోళన కుటుంబ సభ్యుల్లో నెలకొంది.
గోదావరి లాంచీ ప్రమాదంపై ప్రధాని మోడీ, మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
చీకటి పడుతున్న కొద్దీ ఆందోళన..
కచ్చులూరు సమీపంలో పర్యాటకుల లాంచీ బోల్తా పడిందనే విషయం తెలుసుకున్నప్పటి నుంచీ .. అందులో ప్రయాణిస్తోన్న వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మహారాజుల కాలనీలో సమయం గడుస్తున్న కొద్దీ, చీకటి పడుతున్న కొద్దీ బాధితుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కడిపి కొండ మహారాజుల కాలనీలో కొన్నేళ్లుగా నివసిస్తోన్న ఒకే కుటుంబానికి చెందిన 17 మంది పాపికొండలకు బయలుదేరి వెళ్లడం, అక్కడ ప్రమాదానికి గురికావడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. గొర్రె ప్రభాకర్, సీవీ వెంకటస్వామి, బీ రాజేంద్ర ప్రసాద్, కొండూరు రాజ్ కుమార్, బసికే ధన్ రాజ్, గడ్డమీది సునీల్, కొమ్ముల రవి, బసికె రాజేందర్, బసికె అవినాష్, గొర్రె రాజేంద్ర ప్రసాద్ గల్లంతైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఒడ్డుకు చేరినట్లు ప్రసార మాధ్యమాల ద్వారా
అదే ప్రాంతం నుంచి వెళ్లిన అయిదుమంది సురక్షితంగా ఒడ్డుకు చేరినట్లు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న స్థానికులు.. వారికి ఫోన్ చేశారు. తాము ప్రాణాలతో బయట పడ్డామని తెలిపారు. తమతో పాటు వచ్చిన మరి కొందరి జాడ తెలియరావట్లేదని అన్నారు. వారికి ఫోన్ చేసినప్పటికీ.. అందుబాటులో లేరని తెలిపారు.
ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల పరిహారం
కచ్చులూరు వద్ద గోదావరిలో చోటు చేసుకున్న ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి బయలుదేరి వెళ్లిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఉండటం విషాదకరమని అన్నారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించారు కేసీఆర్. ఈ ఘటనపై ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం చోటు చేసుకున్న ఘటన గల కారణాలను కేసీఆర్.. వైఎస్ జగన్ ను అడిగి తెలుసుకున్నారు. మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణకు చెందిన వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు.