అమరావతికి కేసీఆర్: జగన్తో కీలక భేటీ: ఇద్దరూ ఏం తేల్చనున్నారు..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతికి వస్తున్నారు. 20 రోజుల వ్యవధిలో ఆయన రెండో సారి అమరావతి తో ఆయన ఏపీ సీఎం జగన్తో భేటీ అవుతున్నారు. విజయవాడలో అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత సీఎం జగన్ నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి ఆ తరువాత స్వరూపానంద నిర్వహిస్తున్న ఆధ్యా త్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జల..విద్యుత్ సమస్యల గురించి చర్చించి..ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలను పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఇదీ కేసీఆర్ షెడ్యూల్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో అమరావతికి చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు పయనమవుతారు. మధ్యాహ్నం 1.25కు గేట్వే హోటల్కు చేరుకొని అక్కడి నుంచి 1.45కు దుర్గామల్వేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.15 గంటల వరకు అక్కడే ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు వైఎస్ జగన్ నివాసానికి చేరుకొని ఆయనకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను అందించనున్నారు. అక్కడే భోజనం చేసి సాయత్రం 4.15కు గేట్వే హోటల్కు చేరుకొని తిరిగి సాయంత్రం 5 గంటలకు కృష్ణా తీరంలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో జరిగే శారదాపీఠం ఉత్తరాదికారి ఆశ్రమ దీక్షా స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉంటారు. తర్వాత గన్నవరం విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్కు తిరిగి వెళ్లనున్నారు.
వివాదాల పైన ఇద్దరి మధ్య చర్చలు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏపీ సీఎం తన నివాసంలో విందుకు ఆహ్వానించారు. అదే సమయంలో తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కేసీఆర్..జగన్ను ఆహ్వానించనున్నారు. ఏపీ ఎన్నికల్లో గెలిచిన తరువాత తొలి సారిగా కేసీఆర్ నివాసానికి వెళ్లిన జగన్కు అక్కడ ఏ స్థాయిలో ఆత్మీయ స్వాగతం లభించిందో..అదే స్థాయిలో కేసీఆర్ కు సైతం స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తరువాత అక్కడే ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై రెండు ప్రభుత్వాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పైన చర్చించే అవకాశం ఉంది. అందులో భాగంగా అయిదేళ్ల కాలంగా పెండింగ్లో ఉన్న షెడ్యూల్ 9, 10లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకా లు, విద్యుత్ బిల్లుల బకాయిలు తదితర సమస్యలను రెండు రాష్ట్రాల ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. ఇప్పుడు ఇద్దరు సీఎంల సమావేశంలో వీటిలో కొన్నింటికి పరిష్కారం లభించే అవకాశాలున్నాయి.
సాయంత్రం గవర్నర్తో కలిసి..
ఇద్దరు ముఖ్యమంత్రులకు ఒక విధంగా ఆధ్యాత్మిక గురువుగా ఉన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వద్ద శిష్యరికం చేస్తున్న కిరణ్ బాలస్వామికి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పగింతముగింపు కార్యాక్రమంలో వీరు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ పాల్గొంటారు. నరసింహన్ మధ్నాహ్నానికి విజయవాడకు చేరుకుంటారు. గేట్వే హోటల్లో బస చేస్తారు. సాయంత్రం కృష్ణాతీరంలో జరిగే సన్యాసాశ్రమ దీక్షల ముగింపు కార్యక్రమానికి గవర్నర్తో పాటు ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఆ తరువాత గవర్నర్..కేసీఆర్ హైదరాబాద్ తిరిగి వెళ్లనున్నారు.