ఛానళ్ల నిలిపివేత: కేసీఆర్కు బాసటగా కూతురు కవిత
హైదరాబాద్: తెలంగాణలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టివి 9 ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కుమార్తె, నిజామబాద్ ఎంపీ కవిత సమర్దించారు. తెలంగాణలో టీవి ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయడం సరైందేనని ఓ ప్రైవేట్ ఛానల్తో తెలిపారు.
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టివి 9 ఛానళ్ల ప్రసారం చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆయన మంత్రులపై పేరడీగా "అసభ్యకర బాష" ను ఉపయోగించారని చెప్పారు. "మీరు ఒక వైపు మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వంపై ఆ రెండు ఛానళ్లు ఎలాంటి కథనాలను ప్రసారం చేసాయో చూడండి. వారు తప్పుడు భాషను ఉపయోగించారు. ఆ రెండు ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి" అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆ రెండు టీవీ ఛానళ్ల ప్రసారాల నిలిపివేత వెనుక తన తండ్రి కేసీఆర్ ప్రమేయం లేదన్నారు. మంగళవారం వరంగల్ జిల్లాలోని కాళోజీ శత జయంతి వేడుకల్లో కేసీఆర్ మాట్లాడుతూ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టివి 9 చానళ్ల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణలో చానళ్లు బతకదలిస్తే తెలంగాణకు సెల్యూట్ చేయాలని, తెలంగాణ సమాజాన్ని గౌరవించాలని తెలంగాణ కెసిఆర్ చానళ్ల ప్రసారాలు నిలిపివేసిన ఎంఎస్ఓలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ప్రజావ్యతిరేక చానళ్లను ప్రసారం చేయబోమని ఎంఎస్ఓలు బంద్ చేశారని, దీన్ని ఢిల్లీ తీసుకుపోయి అక్కడ, ఇక్కడ డ్రామా అడుతున్నారని కెసిఆర్ విమర్శించారు. తెలంగాణలోని జర్నలిస్టులకు ఆయన హితబోధ కూడా చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించే విధానాలను అనుసరించవద్దనే రీతిలో ఆయన జర్నలిస్టులకు సూచించారు.