ఏపీకి ప్రత్యేకహోదా కోసం జగన్ దీక్ష: బాబుకు తెలంగాణ కాంగ్రెస్ హెచ్చరిక
హైదరాబాద్/గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని మద్దతు లభిస్తోంది. ప్రత్యేక హోదా కోసం జగన్ ఆరు రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషమిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దీక్షను విరమింప చేసే బాధ్యత, కేంద్ర, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా పైన కేంద్రం సానుకూలంగా స్పందించాలన్నారు. ప్రత్యేక హోదాను అమలు చేయాలంటూ నాడు వైసిపి లోకసభను స్తంభింప చేసినప్పుడు రాహుల్ గాంధీ కూడా మద్దతిచ్చారని చెప్పారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదు.. పదేళ్లు కావాలని బిజెపి చెప్పిందని గుర్తు చేశారు. హోదాపై కేంద్రం స్పందించాలన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్ అంటేనే అరికాలి పైన లేచే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు కూడా జగన్ దీక్ష పైన స్పందించారు. జగన్కు హోదా పైన బిజెపి హామీ ఇవ్వాలని, ఆయన దీక్షను విరమింప చేయాలన్నారు. జగన్ ఆరోగ్యం దెబ్బతింటే భవిష్యత్తులో ఇబ్బంది పడవలసి వస్తుందన్నారు.
జగన్ దీక్షకు క్రమంగా మద్దతు పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఆయన దీక్ష సోమవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడాక నిప్పులు చెరిగిన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా నిరవధిక దీక్షకు మద్దతు పలికారు.
ప్రత్యేక హోదా విషయంలో వైసిపితో కలిసి ఎంత దూరమైనా నడుస్తామని సిపిఎం ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు టిడిపికి అండగా నిలబడిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సైతం గుంటూరు జిల్లా నల్లపాడు జగన్ దీక్షా వేదిక వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు.