బెదిరింపులొద్దు: విలీనంపై కెసిఆర్, టూర్పై జగన్ టార్గెట్
హైదరాబాద్: విలీనం అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన, పర్యటన విషయమై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మండిపడుతున్నారు. కెసిఆర్ పైన కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
కెసిఆర్ది రెండు నాల్కల ధోరణి అని, బెదిరింపులు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసు పార్టీయేనని ప్రజలకు తెలుసునని చెప్పారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఒంటరి పోరుకు దిగనుందని చెప్పారు. విలీనం అవుతానని చెప్పింది... ఆ తర్వాత కాదని చెప్పింది కెసిఆరే అన్నారు.
కెసిఆర్ వారం రోజుల్లో మాట మార్చారని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఆయన ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కుటుంబం చుట్టే తెలంగాణ తిరగాలని ఆయన భావిస్తున్నారని, సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు. కెసిఆర్ స్వార్థం మానకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని, విలీనంపై పునరాలోచన చేయాలన్నారు. పోలవరం ముంపుకు సంబంధించి ఏడు మండలాలను సీమాంధ్రకు వదిలేది లేదన్నారు. జగన్కు తెలంగాణలో పర్యటించే హక్కు లేదన్నారు.
కెసిఆర్ విలీనంపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గండ్ర వెంకటరమణ రెడ్డివరంగల్ జిల్లాలో అన్నారు. సోనియా పైన చెసిన వ్యాఖ్యలను కెసిఆర్ ఉపసంహరించుకోవాలని సూచించారు. కెసిఆర్ కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకుంటే అధికార పక్షంలో ఉంటారు.. లేదంటే ప్రతిపక్షంలో ఉంటారన్నారు.
అదే సమయంలో జగన్ పైనా మండిపడ్డారు. జగన్ ఏ మొహం పెట్టుకొని రేపు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని ప్రశ్నించారు. జగన్ పర్యటిస్తే మానుకోట పునరావృతమవుతుందని హెచ్చరించారు. కెసిఆర్ విలీనంపై మాట నిలబెట్టుకోవాలని, జగన్ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాలని వి హనుమంత రావు అన్నారు. కాగా, జగన్ పర్యటనకు అనుమతించవద్దని పలువురు నేతలు గవర్నర్ నరసింహన్ను కలిసి విజ్ఞప్తి చేశారు.