‘‘ఆంధ్రావాడివి... నీకిక్కడేం పని’’ అంటూ అవమానించారు: టీ సీఎస్పై డీఐజీ
హైదరాబాద్: ‘‘ఏమయ్యా... నువ్వెందుకు రిలీవ్ అవలేదు? ఆంధ్రా వాడివి నీకిక్కడేం పని? అని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ నలుగురిలో కోప్పడ్డారు. పలువురు ఐఏఎస్ల ముందే నన్ను అవమానించారు'' అంటూ ఏపీకి చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మపై ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
ఈ సంఘటన హైదరాబాద్ శివార్లలోని హిమాయత్సాగర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడెమీ. అప్పాగా పిలిచే దీనిని, మూడు దశాబ్దాల కిందట ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇక్కడికి తరలించారు. సమైక్య రాష్ట్రంలో 23 జిల్లాల పోలీసులకూ ఇక్కడే శిక్షణ ఇచ్చేవారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పాను పదో షెడ్యూల్లో చేర్చారు.
ఇరు రాష్ట్రాలూ పదేళ్లపాటు దీన్ని ఉపయోగించుకోవచ్చని చట్టంలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నాటికి ఏపీ కేడర్కు చెందిన అదనపు డీజీ మాలకొండయ్య అప్పాకు డైరెక్టర్గా ఉన్నారు. ఆయన కొనసాగుతుండగానే, విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడెమీ పేరును తెలంగాణ పోలీస్ అకాడెమీగా మార్చి ఈశ్కుమార్ను డైరెక్టర్గా నియమించింది.
అప్పాలో ఒక డీఐజీ స్థాయి పోస్టు ఉంది. విభజనకు పూర్వం నుంచి ఏపీ కేడర్కు చెందిన వెంకటేశ్వర్రావు ఆ పోస్టులో ఉన్నారు. అయితే, ఆయనను రిలీవ్ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జూన్ 25వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. పరిమళ నూతన్ అనే అధికారిని ఆయన స్థానంలో నియమించింది.
కానీ, తాను ఏపీ కేడర్కు చెందిన అధికారినని, తెలంగాణ ప్రభుత్వం తనను ఎలా రిలీవ్ చేస్తుందనే కారణంతో వెంకటేశ్వరరావు రిలీవ్ కాలేదు. తెలంగాణ అధికారికి చార్జి ఇవ్వడానికి నిరాకరించారు. అదే సమయంలో గత నెలలో పదో షెడ్యూలులోని సంస్థలపై సచివాలయంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అప్పా తరఫున వెంకటేశ్వరరావు హాజరయ్యారు.
ఆ సమావేశంలో, ‘‘ఏమయ్యా... నువ్వెందుకు రిలీవ్ అవలేదు? ఆంధ్రా వాడివి నీకిక్కడేం పని? అని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ నలుగురిలో కోప్పడ్డారు. పలువురు ఐఏఎస్ల ముందే నన్ను అవమానించారు'' అని వెంకటేశ్వర్రావు ఏపీ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అప్పా పదో షెడ్యూలులో ఉందని ఇరు రాష్ట్రాల పోలీసులకూ అందులో శిక్షణ ఇచ్చే అవకాశం ఉన్నందున.. తానే కొనసాగుతానని సీఎస్కు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆగస్టు మూడో తేదీన వెంకటేశ్వరరావు పేరును అప్పా రికార్డుల నుంచి తొలగించారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా వందనానికి అప్పాకు వెళ్లిన వెంకటేశ్వరరావుతో 3వ తేదీనే రిలీవ్ చేసేశామని, ఇక్కడికి ఎందుకు వచ్చారని అడగడంతో ఆయనకు విషయం తెలిసింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్లోని ఏపీ పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఏపీ డీజీపీ రాముడిని కలిసి ఫిర్యాదు చేశారు.
పూర్తి వివరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని డీజీపీ కోరడంతో సదరు డీఐజీ వివరంగా రాసిచ్చారు. అనంతరం ఆయన ఇదే విషయాన్ని ఏపీ సీఎస్, గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశారు. అప్పాలోనూ, పోలీసు ఉన్నతాధికార వర్గాల్లోనూ ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.