స్వైన్ఫ్లూతో 19మంది మృతి, అదుపులో: కేసీఆర్, జాగ్రత్తపడిన బాబు
హైదరాబాద్: స్వైన్ ఫ్లూతో ఇప్పటి వరకు 19 మంది చనిపోయారని, అయితే పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఒకేరోజు ఐదుగురు చనిపోయారన్న వార్త బాధ కలిగించిందని, వ్యాధి నివారణకు కేంద్ర సహకారం కోరామన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడానని, కేంద్రం నుండి నిపుణుల బృందాన్ని పంపిస్తున్నట్లు చెప్పారన్నారు. స్వైన్ ఫ్లూ భయంకరమైన సమస్య కాదని, ప్రయివేటు ఆసుపత్రులు చెప్పాయన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత వల్ల 99 శాతం వ్యాధి సోకదని, తీవ్రమైన జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటే తక్షణం వైద్యులను సంప్రదించాలన్నారు.
స్వైన్ ఫ్లూను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చినట్లు చెప్పారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు సహా హైదరాబాదులోని మరో 25 ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. చికిత్స కోసం ఆలస్యంగా వచ్చిన గర్భిణి మృతి చెందిందని చెప్పారు.
స్వైన్ ఫ్లూ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇది వ్యాధి కాదని, వైరస్ మాత్రమే అన్నారు. స్వైన్ ఫ్లూ సోకిన రోగి ఇంట్లో వస్తువులను స్టెరిలైజ్ చేయాలని సూచించామన్నారు. రోగి ఇంట్లో ఉన్న ఇతర సభ్యులను కూడా పరీక్షిస్తామన్నారు. యునానీ, హోమియో వైద్యులతో రేపు సమావేశమవుతామని చెప్పారు.
స్వైన్ ఫ్లూ చికిత్స ఉచితంగానే అందిస్తామన్నారు. జిల్లాల్లోని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రాథమికంగానే దీని పైన అవగాహన కల్పిస్తే ఇంత గందరగోళం ఉండేది కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
మంత్రి కామినేనికి చంద్రబాబు ఫోన్
స్వైన్ఫూపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రావుకు విదేశీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఫోన్లో సూచించారు. కాగా, ఏపీలో స్వైన్ఫ్లూ ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి కామినేని శ్రీనివాస్ రావు చెప్పారు.
ఒంగోలు, చిత్తూరులలో రెండు స్వైన్ఫ్లూ కేసులు నమోదైన నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖాధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఈ వ్యాధి నివారణకు కావాల్సిన మందులను సైతం అందుబాటులో ఉంచామన్నారు.
స్వైన్ ఫ్లూపై ఆందోళన వద్దు
తెలంగాణ రాష్ట్రంలోని కార్పోరేట్ ఆస్పత్రుల ప్రతినిధులు బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న స్వైన్ఫ్లూ వ్యాది నివారణపై చర్చించారు. స్వైన్వ్యాది బారిన పడిన వారికి చికిత్స కోసం కార్పోరేట్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు.
ఈ వ్యాది నిర్ధారణకు పాలిమరైజ్ చైన్ రియాక్షన్ మిషన్ల వాడకానికి కార్పోరేట్ ఆసుపత్రులకు సీఎం అనుమతులిచ్చారు. స్వైన్ఫ్లూ రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని, ప్రభుత్వం తరఫున మందులు సరఫరా చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ భేటీ అనంతరం వైద్యులు మాట్లాడారు.
స్వైన్ఫ్లూ గురించి ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. స్వైన్ఫ్లూ ప్రపంచలో అన్ని చోట్లా ఉందని, దీని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాది నివారణకు వాక్సిన్ వేసుకున్నా అది నెల తరువాతే పని చేస్తుందన్నారు.చలి తీవ్రత కారణంగా స్వైన్ఫ్లూ ప్రభావం పెరుగుతోందని, చలి తీవ్రత తగ్గిన వెంటనే ఆ వైరస్ వ్యాప్తి తగ్గిపోతుందన్నారు.