ఏపీ-టీ మధ్య మరో చిచ్చు: కేసీఆర్ వల్లేనని ఫైర్, ఎవరేమన్నారు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో రగడ రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చే వాహనాల పైన తెరాస ప్రభుత్వం పన్ను విధిస్తోంది. ఇది మంగళవారం అర్ధరాత్రి నుండి అమలులోకి రానుంది. అర్ధరాత్రి నుండి అంతర్రాష్ట్ర పన్నుల విధానం ఏపీకి కూడా వర్తింప చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తీరు పైన ఏపీ ప్రయివేటు బస్సుల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
దీనిపై ఏపీ మంత్రి శిద్ధా రాఘవ రావు మంగళవారం స్పందించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్లే బస్సులపై మంగళవారం అర్థరాత్రి నుంచి రవాణా పన్ను విధించాలని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై పునరాలోచించాలని కోరారు. టీ. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన నుంచి వచ్చాక మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.
కేసీఆర్
మంగళవారం రాత్రి నుండి అంతర్ రాష్ట్ర పన్ను విధానం అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రం నిర్ణయించింది. ఏపీ నుండి వచ్చే బస్సులకు పన్ను భారం పడనుంది.
వైయస్ జగన్
తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చే బస్సులపై రవాణా పన్ను విధించడం సరికాదని వైయస్ జగన్ అన్నారు. ఒకేభాష మాట్లాడే రెండు రాష్ట్రాల మధ్య ఇలాంటి పన్నులు వసూలు చేయడం పద్ధతి కాదన్నారు. బస్సులపై రవాణా పన్నువిధించడం వల్ల ప్రజలపై అధిక భారం పడుతుందని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించాలన్నారు.
నరసింహన్
వాహనాలపై తెలంగాణ సర్కారు విధించిన రవాణా టాక్స్ పైన తనకు సమాచారం లేదని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. సమాచారం అందాక స్పందిస్తానన్నారు.
శిద్దా
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్లే బస్సులపై మంగళవారం అర్థరాత్రి నుంచి రవాణా పన్ను విధించాలని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై పునరాలోచించాలని రాష్ట్ర రవాణా మంత్రి శిద్దా రాఘవరావు కోరారు.
సీపీఐ
ఏపీ నుండి తెలంగాణకు వచ్చే బస్సులపై పన్ను విధించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై సీపీఐ మండిపడింది. కేసీఆర్ రెండు రాష్ట్రాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్నారు.
ఇరు రాష్ట్రాల ప్రజలు నష్టపోకూడదనేదే తమ ఉద్దేశ్యమన్నారు. పన్నుల భారం పైన ప్రభుత్వం ఆలోచించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరించాలని కోరారు. పన్నుల భారంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. పన్నులు విధిస్తే నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతాయన్నారు. ఉమ్మడి రాజధాని కారణంగా అనేక రాకపోకలు జరుగుతాయని ఆయన గుర్తు చేశారు.
ఇవాళ అర్ధరాత్రి నుండి అంతర్ రాష్ట్ర పన్ను విధానం అమలులోకి రానున్నందున ప్రయివేటు ట్రావెల్స్ యజమానులు మంగళవారం సమావేశమయ్యారు. రేపటి నుండి ఏపీ నుండి వచ్చే ప్రయివేటు బస్సులను నిలిపివేయాలని నిర్ణయించారు. దీంతో రాత్రి నుండి 80 శాతం బస్సులు నిలిచిపోనున్నాయి. ముందస్తు రిజర్వేషన్లు ఇప్పటికే నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై బుధవారం హైకోర్టుకు వెళ్లనున్నారు. ఎవరేమన్నారు..?