జగన్కు అరుదైన గౌరవం ..ఏపీలో కాదు తెలంగాణలో: అక్కడే దక్కిన తొలి అవకాశం: కేసీఆర్ నిర్ణయం..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్కు అరుదైన గౌరవం దక్కనుంది. ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడు వారాలు అయింది. అయితే, ఏపీలో కాకుండా ఆ అవకాశం తెలంగాణలో దక్కించుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు. అక్కడకు వెళ్తున్న జగన్కు ఆ అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో కేసీఆర్ ఏపీకి వచ్చిన సమయంలోనూ ఇదే జరిగింది. ఇంతకీ కేసీఆర్ ప్రభుత్వం జగన్కు ఇస్తున్న ఆ గౌరవం ఏంటి...
కాళేశ్వరం శిలాఫలకంపై జగన్ పేరు..
ఈ నెల 21న తెలంగాణ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతికి వచ్చి స్వయంగా జగన్ను ఆహ్వానించారు. దీంతో..జగన్ సైతం కేసీఆర్ ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లాలని నిర్ణయించారు. అంతకు ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు వెళ్లిన కేసీఆర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం ఇదే కార్యక్రమానికి రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. దంతో..ఏపీ-మహారాష్ట్ర ముఖ్యమంత్రులిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరు రాకకు గుర్తుగా..వారికి గౌరవం ఇస్తూ ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలా ఫలకం పైన ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల పేర్లు ఉండేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అదే శిలాఫకలకం మీద ముందుగా గవర్నర్ నరసింహన్ పేరు..తరువాత కేసీఆర్..ఆ తర్వాత ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల పేర్లు..వారి తరువాత స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధుల పేర్లు నమోదు చేయించే బాధ్యత తెలంగాణ సాధారణ పరిపాలనా శాఖ తీసుకుంది.
ఏపీలో ఇప్పటి దాకా దక్కని ఛాన్స్..
తాజా ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విజయం సాధించింది. గత నెల 30వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసారు. ఆ కార్యక్రమానికి కేసీఆర్ను జగన్ ఆహ్వానించారు. అదే విధంగా హైదరాబాద్లో ఇద్దరు సీఎంలు ఇప్పటి వరకు రెండు సార్లు భేటీ అయ్యారు. అయితే, ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అయి మూడు వారాలు అవుతున్నా ఇప్పటి వరకు ఎక్కడా అధికారికంగా ఎటువంటి శంఖుస్థాపన..ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన లేదు. సీఎంగా పూర్తిగా సమీక్షలు..పర్యటనలు..శాసనసభా సమావేశాలకే జగన్ పరిమితం అయ్యారు. దీంతో..ఈ మూడు వారాలుగా ఏపీలో దక్కని అవకాశం తొలుతగా తెలంగాణలో జగన్కు దక్కనుంది. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఆ ప్రాజెక్టు వద్ద ప్రారంభోత్సవ శిలా ఫలకం ఎప్పటికీ ఉండిపోనుంది.
గతంలో ఏపీలో కేసీఆర్కు ఇదే రకంగా..
అక్టోబర్ 21, 2015న ఏపీ నూతన రాజధాని అమరావతికి శంఖుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటుగా గవర్నర్ నరసింహన్ ..సింగపూర్ మంత్రులు..వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. దీంతో..రాష్ట్ర విభజన తరువాత తొలి సారి ఏపీకి వచ్చిన కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సభలో పాల్గొన్న కేసీఆర్కు అక్కడి రాజధాని ప్రజలు కేరింతలు..హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. ఇక, ఆ కార్యక్రమంలో భాగంగా అక్కడ శిలాఫలకం ఏర్పాటు చేసారు. అందులో ప్రధాని మోదీ..గవర్నర్ నరసింహన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ఆ తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఇతర ప్రముఖల పేర్లను శిలాఫలకం మీద నమోదు చేసారు. ఇక, ఇప్పుడు అదే విధంగా జగన్ పేరుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తోంది.