బాబును తెలంగాణ ప్రభుత్వం శిక్షించాలి: ఓటుకు నోటుపై ఎమ్మెల్యే రోజా
Recommended Video
విజయవాడ: తెలంగాణలో కేసీఆర్ మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు వణుకు పుడుతోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఓటుకు నోటు కేసు దర్యాప్తు ముమ్మరం అవుతోంది కాబట్టే ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు చేస్తున్నారని విమర్శించారు.
ఓటుకు నోట్లు ద్వారా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబును శిక్షించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. 'బ్రీఫ్డ్ మీ' అన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్దారించిందని, కాబట్టి ఆ ఆధారాలతో బాబును అరెస్ట్ చేయాలని అన్నారు.
ఇక రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు రోజా. నేరాలను అరికట్టాల్సిన చంద్రబాబే.. తన ఎమ్మెల్సీల చేత మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని ఆమె పేర్కొన్నారు.
దాచేపల్లి బాధితురాలి వద్దకు తొలుత తాము వెళ్లి పరామర్శిస్తే గానీ చంద్రబాబు స్పందించలేదని, ప్రతిపక్షం అడిగితే తప్ప ఇలాంటి ఘటనలను పట్టించుకోరా? అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు తన అధికారం, డబ్బుతో దొంగ రాజకీయాలు చేస్తూ తిరిగి తమ పైనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పుడెన్ని దొంగదీక్షలు చేసినా ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని అన్నారు.