ఏపీఎన్జీవో భూమి వెనక్కి, అశోక్బాబుకి షాక్: జేసీ చక్రం
హైదరాబాద్/అనంతపురం: ఏపీఎన్జీవోలకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని శేరిలింగంపల్లి మండలంలో గోపనపల్లి సర్వే నెంబర్ 36, 37లోని ఏపీఎన్జీవోలకు సంబంధించి 189 ఎకరాల 14 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ఆర్డీవో సురేష్ ఒడ్డార్, శేరిలింగంపల్లి తహశీల్దారు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సిబ్బందితో తరలి వెళ్లి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదించారు. ఈ భూముల్లో ప్రభుత్వ భూములు అని బోర్డు పెట్టారు.
అశోక్ బాబుకు షాక్
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుకు కో ఆపరేటివ్ ట్రిబ్యునల్ కోర్టులో చుక్కుదురైంది. గోపన్ పల్లిలోని ఏపీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆయనకు అర్హత లేదని ట్రిబ్యునల్ న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు సొసైటీలో ఆయన సభ్యత్వం చెల్లదని తేల్చి చెప్పింది.
మున్సిపల్ ఎన్నికల్లో చక్రం తిప్పిన జేసీ
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి టీడీపీలో ముసలం వచ్చింది. చైర్ పర్శన్ అభ్యర్థి పదవి ఆశించి భంగపడిన టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి సరస్వతి తన పదవికి రాజీనామా చేశారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి దక్కుతుందని సరస్వతికి పార్టీ పెద్దల నుంచి హామీ లభించిందని సమాచారం.
ఇంతలో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి రంగప్రవేశం చేయడంతో ఛైర్మన్ పదవి రేసులో ఆమె పేరు వెనక్కి వెళ్లిపోయి కొత్త వ్యక్తి పేరు ముందుకు వచ్చిందంటున్నారు. ఛైర్ పర్సన్గా ఆమె ఎన్నిక దాదాపు పూర్తవుతున్న తరుణంలో పార్టీ సహచరులు అనూహ్యంగా వేరే వ్యక్తిని తెర పైకి తీసుకురావడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు.