వైఎస్ జగన్ బావకు హైకోర్టులో ఊరట!
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ, వైఎస్ షర్మిళ భర్త, ప్రముఖ క్రైస్తవ మత ఉపన్యాసకుడు బ్రదర్ అనిల్ కుమార్ కు ఊరట లభించింది. ఖమ్మం న్యాయస్థానం జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసులో ఖమ్మం న్యాయస్థానం బ్రదర్ అనిల్ కుమార్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ అమలు కాకుండా.. స్టే ఇచ్చింది.
2009 మార్చి 28వ తేదీన బ్రదర్ అనిల్ కుమార్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఖమ్మం కరుణగిరి ప్రాంతంలో ఒక పార్టీకి అనుకూలంగా ఆయన ప్రచారం చేశారని అప్పట్లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తరువాత ఆయన కరుణగిరిలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కరపత్రాలు పంచారని ఆయనపై రాజకీయ ప్రత్యర్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్రదర్ అనిల్ కుమార్ పై కేసు పెట్టారు పోలీసులు. ఆ కేసులో ఏ1గా ఉన్న అనిల్ కుమార్ ఇన్నాళ్లూ న్యాయస్థానానికి హాజరు కాలేదు.
పలుమార్లు ఆయనకు సమన్లను జారీ చేసినప్పటికీ.. ఏదో ఒక కారణంతో విచారణ నిమిత్తం న్యాయస్థానానికి గైర్హాజరవుతూ వచ్చారు. దీనితో ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచాలని ఖమ్మం సెకెండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి జస్టిస్ ఎం జయమ్మ ఈ నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీనిపై బ్రదర్ అనిల్ కుమార్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆయన గైర్హాజర్ కావడానికి గల కారణాలను వివరించారు. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అమలు కాకుండా స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై వాదనలను విన్న అనంతరం హైకోర్టు స్టే ఉత్తర్వులను జారీ చేసింది.