ఎపి తప్పు, కౌన్సెలింగ్పై నిర్ణయం: పాపిరెడ్డి (పిక్చర్స్)
హైదరాబాద్: ఎంసెట్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా నియమితులైన తుమ్మల పాపిరెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఎంసెట్ అడ్మిషన్లు, స్థానికత విషయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న యూనివర్సిటీ వైస్చాన్స్లర్ పోస్టుల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి త్వరలో భర్తీ చేసేలా చూస్తానని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్గా నియమితులైన పాపిరెడ్డిని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్గా కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగం మాజీ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్ అడ్మిషన్ల విషయంలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో రెండురోజుల కిందటే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా మండలి చైర్మన్ నియామకాన్ని పూర్తి చేసింది.
తెలంగాణ ఉద్యమం జోరుగా సాగిన సందర్భంలో ఉద్యమంలో పాపిరెడ్డి క్రియాశీలపాత్ర పోషించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవికి ప్రొఫెసర్ టి పాపిరెడ్డిని ఎంపిక చేశారు. ప్రొఫెసర్ పాపిరెడ్డి నియామకం పట్ల అధ్యాపక, విద్యార్థి సంఘాల జెఏసి ప్రతినిధులు, వర్సిటీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రొఫెసర్ పాపిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
జగదీష్ రెడ్డి అభినందన
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా నియమితులైన తుమ్మల పాపిరెడ్డిని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు.
ఉస్మానియా నుంచి డిగ్రీ
ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం పౌనూర్ గ్రామానికి చెందిన పాపిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1975లో డిగ్రీ, కాకతీయ వర్సిటీ నుంచి 1977లో అర్థశాస్త్రంలో పిజి, 1980లో ఎంఫిల్, 1988లో పిహెచ్డి పూర్తి చేశారు.
పాపిరెడ్డి ప్రత్యేక సబ్జెక్టులు ఇవే..
ఆరేళ్లపాటు డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన, 26ఏళ్లపాటు పీజీ కళాశాలలో పనిచేశారు. ప్రొఫెసర్గా 14 ఏళ్లు కొనసాగారు. పొలిటికల్ ఎకానమీ, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్, మాక్రో ఎకనామిక్స్ ఆయన స్పెషలైజేషన్ సబ్జెక్టులు.
పలు పదవుల నిర్వహణ
ఎకనామిక్స్ విభాగం అధిపతిగా, ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా, పరీక్షల విభాగం నియంత్రణాధికారిగా పలు పదవులు నిర్వహించారు. కాకతీయ వర్సిటీలో పనిచేసే అధ్యాపకులకు సంబంధించిన అకుట్ కార్యదర్శిగా, అధ్యక్షుడిగానూ ఆయన పనిచేశారు.