రాజ్యసభ: కెవిపికి జయసుధ, తెలంగాణ నేతల ఆగ్రహం
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు రాజ్యసభ అభ్యర్థి ఎంఏ ఖాన్కు పోగా మిగిలిన ఓట్లను సీమాంధ్ర ప్రాంత పార్టీ అభ్యర్థి కెవిపి రామచంద్ర రావుకు కేటాయించడంపై టి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన ఓట్లను తాము తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కె కేశవ రావుకు వేస్తామని వారు చెబుతున్నారు. గోల్కొండ హోటల్లో భేటీ అయిన టి నేతలు ఓటింగు విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు.
రాజ్యసభ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును కాంగ్రెసు అభ్యర్థి ఎంఏ ఖాన్కు, రెండో ప్రాధాన్యత ఓటును కెకెకు వేయాలని నిర్ణయించారు. మిగిలిన ఓట్లలో తొలి ప్రాధాన్యత ఓటును కెకెకు వేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదుకు చెందిన పలువురు ఎమ్మెల్యేల ఓట్లను అధిష్టానం కెవిపి, టి సుబ్బిరామి రెడ్డిలకు కేటాయించింది. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కెవిపి రామచంద్ర రావుకు మంత్రి దానం నాగేందర్, సికింద్రాబాద్ శాసన సభ్యురాలు జయసుధ, టి సుబ్బిరామి రెడ్డికి ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డిల ఓట్లను అధిష్టానం కేటాయించింది. వారికి ఓటేసేందుకు తెలంగాణ ప్రాంత నేతలు తిరస్కరించారు.
కాగా, మధ్యాహ్నం పదకొండు గంటల వరకు 190 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 276 మంది శాసన సభ్యులు ఓటు వేయనున్నారు. కాంగ్రెసు పార్టీ ఒక్కో అభ్యర్థికి 47, టిడిపి 37 మంది సభ్యులను కేటాయించింది.