తెలంగాణ నుంచి ఏపీ: అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడ్డ బీజేపీ నేత
అమరావతి: అక్రమ మద్యం తరలిస్తే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత ఒకరు పట్టుబడ్డారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తున్న కేసులో గుడివాక రామాంజనేయులు అలియాస్ అంబిబాబును స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) పోలీసులు అరెస్ట్ చేశారు.
రూ. 6 లక్షలు విలువైన 1920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. గుడివాక రామాంజనేయులు సహా మచ్చా సురేశ్, నరేశ్, గంటా హరీశ్ను అరెస్ట్ చేశారు. రామాంజనేయులను ఏ-1 పేర్కొన్నారు. గుంటూరు ఏఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. 2019లో మచిలీపట్నం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రామాంజనేయులు పోటీ చేశారు.
కాగా, టీడీపీ హయంలో వైన్స్, బార్లు కూడా ఆయన నిర్వహించినట్లు సమాచారం. తాజాగా, అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఆయనను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మద్యం నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం 33 శాతం మద్యం దుకాణాలను మూసివేయడంతోపాటు ధరలు పెంచడంతో కొందరు సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం దిగుమతి చేస్తున్నారు. దొడ్డిదారిన విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటూ ఇప్పటికే పలువురు పట్టుబడిన విషయం తెలిసిందే.