ఎంసెట్ కౌన్సెలింగ్: తెలంగాణ ప్రభుత్వం మరో కొలికి?
హైదరాబాద్: సుప్రీంకోర్టులో తమకు ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ కౌన్సెలింగ్పై మరో కొలికి పెట్టినట్లే కనిపిస్తోంది. ఎంసెట్ కౌన్సెలింగ్ తామే నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో భేటీ అయిన తర్వాత ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎంసెట్ నిర్వహించిన జెఎన్టియు తమ పరిధిలోనే ఉందని, అందువల్ల తామే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలితో మాట్లాడుతామని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్వహిస్తుందని పాపిరెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టుకు విన్నవించామని ఆయన తెలిపారు. విభజన చట్టంలో సూచించిన విధంగానే కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఉమ్మడి ప్రవేశాలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం తన ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసింది. దాని ద్వారానే తెలంగాణలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుందని సుప్రీంకోర్టుకు విన్నవించినట్లు చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలమేరకు విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 31వ తేదీలోగా ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్రెడ్డి సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఫీజు రీఇంబర్స్మెంట్ స్థానికతపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావలసి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని వేణుగోపాల్రెడ్డి చెప్పారు.
కౌన్సెలింగ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని తెలిపారు. ఏది ఏమైనా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారింభిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫీజు రీఇంబర్స్మెంట్, కొన్ని విషయాల్లో ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలసి ఉందని ఆయన అన్నారు. ఈరోజే సుప్రీం కోర్టు నుంచి తీర్పు వచ్చిందని, దీనిపై తెలంగాణ అధికారులు ఆలోచించుకోవాలి కాబట్టి వీలైతే రేపు లేదా ఎల్లుండి వారితో చర్చలు జరుపుతామని వేణుగోపాల్రెడ్డి తెలిపారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ ఎవరు నిర్వహించాలనే ఆంశంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. విభజన చట్టంలో చెప్పిన విధంగా నిర్వహించాలని సూచించింది. అయితే, విభజన చట్టంలో ఏముందనే విషయంపై ఇప్పుడు వివాదం చెలరేగే అవకాాశాలున్నాయి. ఆ వివాదాన్ని రేపడానికే తెలంగాణ విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి జెఎన్టియు తమ పరిధిలో ఉంది కాబట్టి కౌన్సెలింగ్ తామే నిర్వహిస్తామని చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు.