డిగ్గీ చెప్పినా టి మంత్రులు నో, మంత్రితో చిరంజీవి ప్రతిజ్ఞ
హైదరాబాద్: కేబినెట్ భేటీకి వెళ్లే విషయమై తర్జన భర్జన పడిన తెలంగాణ ప్రాంత మంత్రులు చివరకు గైర్హాజరయ్యారు. అంతకుముందు సోమవారం ఉదయం పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ ముసాయిదా బిల్లును కుట్రపూరితంగా తిప్పి పంపారనే ఆగ్రహంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఉన్నారు.
ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీని బహిష్కరించాలని టి మంత్రులు భావించారు. మరికొందరు మంత్రులు, నేతలు విభేదించినట్లుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీకి వెళ్లి నిరసన తెలపాలని కొందరు సూచించారు. అయితే చివరకు వారు కేబినెట్ భేటీకి గైర్హాజరయ్యారు.
జానా నివాసంలో భేటీకి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, రాంరెడ్డి వెంకట రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సునిత లక్ష్మా రెడ్డి తదితరులు హాజరయ్యారు.
మరోవైపు, తెలంగాణ ప్రాంత మంత్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేశారని సమాచారం. కేబినెట్ భేటీకి హాజరు కావాల్సిందిగా వారికి సూచించారు. బడ్జెట్ సమావేశాలు రాజ్యాంగ ప్రక్రియ కాబట్టి హాజరు కావాలని వారుకి సూచించారు. ఓటాన్ బడ్జెట్ సమావేశాలకు ఆటంకం కలిగించవద్దని, తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుందని వారికి చెప్పారు. మరోవైపు రాష్ట్ర కేబినెట్ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైంది. బడ్జెట్ను మంత్రివర్గం ఆమోదించింది. నగర మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్లు అసెంబ్లీకి వచ్చినా కేబినెట్ భేటీకి హాజరు కాలేదు.
ప్రతిజ్ఞ చేయించిన చిరు
సమైక్యాంధ్ర కోసం తుది వరకు పోరాడుతామని కాంగ్రెసు పార్టీ నేతలతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రతిజ్ఞ చేయించారు. ఆదివారం ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సమైక్య సెగ తగిలింది. ఆ తర్వాత ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమయంలో పలువురు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.
దానికి స్పందించిన చిరు.. పక్కనున్న మంత్రి వట్టి వసంత్ కుమార్, ఎమ్మెల్యే కన్నబాబు, తోట త్రిమూర్తులు ఇతర పార్టీ నాయకులను దగ్గరకు పిలిపించుకొని సమైక్యాంధ్ర కోసం ప్రతిజ్ఞ చేశారు. తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనే వారిలో తాను ముందుంటానన్నారు.