అసెంబ్లీలో 'ఆసరా'పై చర్చ: 'అర్హులందరికీ పింఛన్లు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పెద్దలు గొప్పల కోసమే ఆసరా పథకాన్ని ప్రారంభించారని బీజేపీ శాసనసభ పక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో 4 లక్షల 60 వేల మంది ఫించన్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.
సభలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం తప్పించుకుంటోందన్నారు. సమగ్ర సర్వే నిర్వహించినాప్పటికీ... మహిళలు, వృద్ధులు, వింతతువులు పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని వెల్లడించారు. అర్హులైన వారికి ఫించన్లు అందడం లేదని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులందరికీ ఫించన్లు అందేవరకు పోరాడతామని చెప్పారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఆసరా పథకంలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల ధ్రువీకరణ జరుగుతున్న తీరుపై సోమవారం సాయంత్రం సచివాలయంలో మంత్రి ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పెన్షన్ దరఖాస్తుల్లో భారీ సంఖ్యలో అనర్హులు ఉన్నట్టుగా తేలిందన్నారు. 44లక్షల 87వేల 699 మంది పెన్షన్ కోసం ఆసరా పథకానికి దరఖాస్తు చేసుకోగా, పరిశీలన తరువాత వీరిలో 24లక్షల 42వేల 83 మంది మాత్రమే పెన్షన్కు అర్హులు అని తేలింది. ఇంకా సుమారు నాలుగు లక్షల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందని అన్నారు.
ఇచ్చిన దరఖాస్తులన్నింటినీ డేటాలో ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు. తిరస్కరణకు గురైన దరఖాస్తులపై కారణం తెలుపుతూ దరఖాస్తుదారుడికి లేఖ రాసే ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్లు, పీడీలకు డేటా ఎంట్రీ సాఫ్ట్వేర్ ఎడిట్ ఆప్షన్ సదుపాయాన్ని కల్పిస్తామని తెలిపారు.
అర్హులకు పింఛన్లు ఇవ్వాలనే నిబద్ధతతో ఉన్న ప్రభుత్వం.. అనర్హులకు ఇచ్చే అధికారుల పట్ల అంతే కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. మండలాలవారీగా సంపూర్ణ ధ్రువీకరణ పూర్తిచేసి, సాచ్యురేషన్ పద్ధతిలో పింఛన్లు ఇవ్వాలని, వికలాంగుల కోసం నియోజకవర్గ కేంద్రాల్లో అంగవైకల్య ధ్రువీకరణ శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇక అభయ హస్తం పథకం కింద 29లక్షల 11వేల 215 మంది లబ్ధిదారులు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 24లక్షలు అయిందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు అందజేసిన నివేదిక ప్రకారం 24లక్షల, 42వేల 83 మంది దరఖాస్తులు అర్హత గలవారివని తేల్చారు.
వీటిలో 21లక్షల, 24వేల 29 మంది వివరాలు డేటా ఎంట్రీలో ఇప్పటి వరకు నమోదు అయ్యాయి. హైదరాబాద్లో 4,72,438 దరఖాస్తులు రాగా, 4,37,269 దరఖాస్తులను పరిశీలించారు. వీటిలో 82లక్షల దరఖాస్తులు మాత్రమే అర్హమైన వాటిగా గుర్తించారు. వీటిలో 30, 565 మంది వివరాలు మాత్రమే నమోదు అయ్యాయి.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జే రేమండ్ పీటర్, సెర్ప్ సీఈవో మురళి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.