ఇరాక్లోని తెలంగాణవాళ్లను క్షేమంగా తెస్తాం: కెటిఆర్
కరీంనగర్/ హైదరాబాద్: ఇరాక్లో ఉన్న తెలంగాణవారిని క్షేమంగా తీసుకుని వస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటి రామారావు హామీ ఇచ్చారు. ఇరాక్లో ఉన్న తెలంగాణవాసుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు.
ఇప్పటి వరకు 600 మంది తెలంగాణ వాసులు ఇరాక్లో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఇరాక్లో ఉన్నవారి కోసం ఎప్పటికప్పుడు తమ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, ఇరాక్లో చిక్కుకున్న భారతీయుల యోగక్షేమాలు తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మోసుల్ నగరంలో అపహరణకు గురైన 40 మంది భారతీయుల జాడ తెలియడం లేదు. వీరి ఆచూకి కోసం విదేశాంగ శాఖ ప్రయత్నాలు సాగిస్తోంది.
ఇరాక్లోని ఎంబసీ కార్యాలయాన్ని మూసేసే ప్రసక్తి లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మోసుల్లో అపహరణకు గురైన భారతీయులు సున్నీ మిలిటెంట్ల చేతుల్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, మిలిటెంట్ల నుంచి ఏ విధమైన డిమాండ్ రాలేదు. అపహరణ వెనక ఎవరున్నారనేది తెలియడం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు.