టీవీలో చూశాకే మా మనవడని తెలిసింది: టి పోలీసులతో రోహిత్ తాత, నాయనమ్మ
గుంటూరు: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ వేముల కేసు విచారణలో భాగంగా తెలంగాణ పోలీసులు అతని కుటుంబసభ్యులను కలుసుకున్నారు.
కేసు విచారణ జరుపుతున్న మాదాపూర్ ఎసీపీ రమణకుమార్ బుధవారం రోహిత్ స్వస్థలం గుంటూరు జిల్లా గురజాలకు వచ్చి రోహిత్ తండ్రి వేముల మణికుమార్, తాత వెంకటేశ్వర్లు, నాయనమ్మ రాఘవమ్మలతో కలిసి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రోహిత్ తాత, నాయనమ్మలు మాట్లాడుతూ.. టీవీలో చూశాకే ఆత్మహత్యకు పాల్పడింది తమ మనవడని తెలిసిందని తెలిపారు. ‘మాకు ముగ్గురు పిల్లలు. పెద్దకుమారుడు మణికుమార్కు 1985లో గుంటూరుకు చెందిన బాణాల ముసలయ్య కూతురు రాధికతో వివాహం చేశామని తెలిపారు.
భర్తతో విభేదాలు చోటుచేసుకోవడంతో పిల్లలు రోహిత్ చక్రవర్తి, రాజ చైతన్యకుమార్, కూతురు జెన్నిమూర్ నీలిమలను తీసుకొని కోడలు రాధిక గుంటూరు ప్రకాశ్నగర్లోని పుట్టింటికి వెళ్లిందని చెప్పారు. 2004 వరకు పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు, కేసులు నడిచాయని, అప్పటి నుంచి కోడలు, పిల్లలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తమకు తెలియకుండా పోయిందని చెప్పారు.
ఆదివారం టీవీలో చూశాకే రోహిత్ తమ మనవడని తెలిసిందని రోహిత్ తాతా, నాయనమ్మలు వివరించారు. కాగా, వారు చెప్పిన విషయమంతా పోలీసులు వీడియో చిత్రీకరిచారు. అనంతరం ఏసీపీ.. సర్పంచి మహంకాళి సీతమ్మతో మాట్లాడి వివరాలు సేకరించారు.
అక్కడి నుంచి తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి పలు విషయాలపై స్పష్టత ఇవ్వాలంటూ అధికారిక లేఖ అందించారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం అధికారులు సైతం గురజాల తహసీల్దార్ కార్యాలయంలో వివరాలు సేకరించారు.