ఏపీని తాకిన తెలంగాణ ఎన్నికల సెగ..! గెలుపు గర్రాలపై జగన్ కసరత్తు.!!
హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల సెగ ఏపిని తాకింది. ఏపిలో ముందస్తు ఎన్నికలు లేకపోయినప్పటికి రాజకీయపార్టీలు చకచక పావులు కదుపుతున్నాయి. ఏపిలో ఎవరి బలం ఎంతుందో తేన్చకునేందుకు గెలుపుగుర్రాల కోసం వేటలో పడ్డాయి పార్టీలు. ప్రతిపక్ష వైసీపి ఒకడుగు ముందుకేసి 140 నియోజక వర్గాల్లో గెలుపొందే అభ్యర్ధులను రంగంలోకి దించాలను కసరత్తు మొదలు పెట్టింది. అందుకోసం సిట్టింగులకు మరింత సాన పెట్టి, చురుకైన ఇతర పార్టీల నేతలకు గాలం వేయాలనుకుంటోంది వైసిపి. పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల గురించి లోతుగా చర్చించినట్టు తెలుస్తోంది.
2019 ఎన్నికలు వైసీపికి ప్రతిష్టాత్మకం..! గెలిచి తీరాలంటున్న జగన్..!!
ఏపీలో విపక్ష వైసీపీ అధినేత జగన్కు వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రానిపక్షంలో పార్టీ మరింత ఇబ్బందుల పాలవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే జగన్ ఎన్నో ప్రణాళికలు రచిస్తూ తెరవెనక బీజేపీ, జనసేనలతో రాజకీయ మైత్రికి తెరలేపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ కొన్ని జిల్లాల్లో టీడీపీకి బలమైన నాయకులుగా ఉన్న వారిని ఓడించేందుకు ఎన్నో ఎత్తులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. జగన్ ప్లాన్లు, వ్యూహాలు ఎలా ఉన్నా టీడీపీలో తిరుగులేని లీడర్లుగా ఉన్న వారి విషయంలో మాత్రం ఆయన ఎత్తులు పనిచేయవని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
అన్ని జిల్లాల్లో గెలుపు గుర్రాలు నిలపాలి..! టీడిపి గెలుపులు నిలువరించాలంటున్న వైసీపి చీఫ్..!
జగన్ టార్గెట్ చేసే టీడీపీ లీడర్లలో రాజధాని జిల్లా అయిన గుంటూరులో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, కృష్ణాలో మైలవరం ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు ఇలా చాలామంది ఉన్నారట. ఆయా ప్రాంతాల్లో జగన్ వారికి ధీటైన అభ్యర్థులను ఎంపికచేసే పనిలో పడ్డారని సమాచారం. ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం అందించిన సమాచారం మేరకు రాష్ట్రంలోని దాదాపు 40 నియోజకవర్గాల్లో వైసీపీ బలహీనంగా ఉందని తేలింది. మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి పోటీ గట్టిగానే ఇస్తుందని నివేదక తేలటతెల్లం చేస్తోంది.
140 నియోజక వార్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట..!!
సుమారు 140 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థిని నిలబెడితే విజయావకాశాలున్నట్లు కూడా పీకే టీం నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకు నియోజకవర్గానికి ఇద్దరు అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను కూడా జగన్ కు అందించినట్లు చెబుతున్నారు. ఈ జాబితాలో ఇతర పార్టీల నేతలు కూడా కొందరు ఉండటంతో వారిని పార్టీలోకి రప్పించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, విజయసాయిరెడ్డితో ఒక టీంను ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రలోని సీనియర్ నేతలను ఫ్యాన్ పార్టీ వైపునకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గెలిచి పార్టీ మారే అభ్యర్థులపై నజర్..! సఛ్చీలురకే సీటు అంటున్న ముఖ్యనాయకులు..!
సామాజక సమీకరణాలతో పాటుగా ఆర్థికంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి ఈ నలభై నియోజకవర్గాల్లో దించాలని జగన్ భావిస్తున్నారు. ఈ నలభై నియోజకవర్గాల్లో దాదాపు పది రిజర్వ్ డ్ స్థానాలు ఉండటంతో వాటి బాధ్యతను పార్లమెంటు సభ్యులకు అప్పగించాలని నిర్ణయించారట. రిజర్వ్ డ్ స్థానాల్లో ఈసారి పార్టీకి నమ్మకంగా ఉండే వారిని ఎంపిక చేయాలని జగన్ ప్రత్యేకంగా సూచించారని సమాచారం. గత ఎన్నికల్లో గెలిచి పార్టీ మారిన వారిలో ఎక్కువ మంది రిజర్వ్ డ్ స్థానాలకు చెందిన వారు కూడా ఉండటంతో ఈసారి ఆచితూచి ఎంపిక చేయాలని జగన్ నేతలకు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.దీంతో 2019 ఎన్నికల్లో తప్పకుండా అదికారంలోకి రావాలని జగన్ క్రుతనిశ్చయంతో ఉన్నారని తెలుస్తోంది.