ఇక విభజన ప్రక్రియ ఆగినట్లే: జెసి వ్యాఖ్య, ప్రోరోగ్పై గాదె
హైదరాబాద్: ఇక రాష్ట్ర విభజన ఆగినట్లేనని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి బుధవారం వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్రం విభజన వైపు వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మంత్రుల బృందానికి (జివోఎం) అటార్నీ జనరల్ నివేదిక, ముఖ్యమంత్రి ప్రోరోగ్ పథకం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జెసి మాట్లాడారు.
అటార్నీ జనరల్ సూచనను కేంద్రం పాటిస్తుందని తాము భావిస్తున్నామని చెప్పారు. సభాపతి పైన అవిశ్వాసం పెట్టనున్నారనే ప్రచారం పైన.. అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం ఏమిటన్నారు. పరిణామాలు చూస్తుంటే రాష్ట్ర విభజన ఆగినట్లేనని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
సంబంధం లేదు: గాదె
అసెంబ్లీ ప్రోరోగ్కు విభజనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి వేరుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సలహా మేరకే గవర్నర్ సభను సమావేశపరుస్తారని చెప్పారు.
కృపారాణికి సమైక్య సెగ
కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి శ్రీకాకుళం జిల్లాలో సమైక్య సెగ తగిలింది. కృపారాణి ఫ్లెక్సీలను పలువురు సమైక్యవాదులు తగులబెట్టారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. అయితే మంత్రి ఫ్లెక్సీలు తగులబెడుతున్న సమయంలో మంటలు ఓ బస్సుకు కూడా అంటుకున్నాయి. దీంతో అందులోని ప్రయాణీకులు పరుగులు తీశారు. మంటలు ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది.
జైరాంతో కేంద్రమంత్రుల భేటీ
కేంద్రమంత్రి జైరామ్ రమేష్తో కేంద్రమంత్రులు చిరంజీవి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కావూరి సాంబశివ రావు, జెడి శీలంలు ఢిల్లీలో భేటీ అయ్యారు.